Share News

PM Modi: ప్రధాని మోదీ-బిల్ గేట్స్ చాయ్ పే చర్చ.. వీటిపైనే ప్రధానంగా చర్చ

ABN , Publish Date - Mar 29 , 2024 | 11:48 AM

భారత ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మధ్య చాయ్ పే చర్చ సందర్భంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ భేటీలో ప్రధాన అంశం సాంకేతికత కాగా దీంతో పాటు విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలు కూడా ఈ చర్చలో ప్రధానాంశాలుగా ఉన్నాయి. అయితే వీడియోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

PM Modi: ప్రధాని మోదీ-బిల్ గేట్స్ చాయ్ పే చర్చ.. వీటిపైనే ప్రధానంగా చర్చ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, అమెరికాకు చెందిన వ్యాపారవేత్త బిల్ గేట్స్(Bill Gates) ఇటీవల భారత పర్యటనకు వచ్చారు. ఆ క్రమంలో తన పర్యటనకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ(narendra modi), బిల్ గేట్స్‌తో చాయ్ పే చర్చ(chaipecharcha) సందర్భంగా మాట్లాడిన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అయితే వీడియోలో వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఇప్పుడు చుద్దాం.

ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ రివల్యూషన్ వరకు అనేక అంశాలపై చర్చించారు. భారతదేశానికి(bharat) సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా ప్రధాని మోదీ బిల్ గేట్స్‌తో పంచుకున్నారు. 45 నిమిషాల వీడియోలో ఇద్దరూ భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, టీకా, సాంకేతికత, మహిళా శక్తి, వాతావరణ మార్పుల గురించి మాట్లాడారు. 2023 G20 సమ్మిట్ సందర్భంగా AIని ఎలా ఉపయోగించారో ప్రధాని మోదీ చెప్పారు. కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో AI తన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఎలా అనువదించిందనే విషయాలను ప్రధాని ప్రస్తావించారు.


ఈ భేటీలో భార‌త ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతోంద‌ని, దేశం మొత్తం డిజిట‌ల్(digitalpayments) విప్లవాన్ని అవలంభిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశంలో కరోనా కాలంలో ప్రజలు కోవిన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యాక్సినేషన్ కోసం బుక్ చేసుకోవడం, అపాయింట్‌మెంట్ తీసుకున్నారని చెప్పారు. దీంతో డిజిటల్ రంగం కరోనా సమయంలో ప్రజల పనిని సులభతరం చేసిందన్నారు.

దేశంలోని అనేక గ్రామాల్లో రెండు లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మించబడ్డాయని ప్రధాని మోదీ(modi) వెల్లడించారు. ఈ ఆరోగ్య కేంద్రాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ ఆసుపత్రులతో అనుసంధానించామన్నారు. వీటిని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చేందుకు డ్రోన్ దీదీ పథకాన్ని ప్రారంభించామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గ్రామాలకు మౌలిక సదుపాయాలను తీసుకువెళ్లామని, దేశంలోని మహిళలు కొత్త టెక్నాలజీని వేగంగా స్వీకరించారని ప్రధాని మోదీ అన్నారు.

మరోవైపు డీప్‌ఫేక్‌ల(deep fake) AI దుర్వినియోగంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. సరైన శిక్షణ లేకుండా ఇలాంటి విషయాన్ని ఎవరికైనా ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టకుండా ఉండటానికి మనం AI కంటెంట్‌ను వాటర్‌మార్కింగ్ చేస్తూ ఉపయోగించాలని ప్రధాని మోదీ వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral News: ఎగ్జామ్‌ పాస్ చేయండి, లేదంటే బ్రహ్మచారిగా మిగిలిపోతా.. టీచర్‌కు విద్యార్థి వింత విజ్ఞప్తి

Updated Date - Mar 29 , 2024 | 11:56 AM