Share News

Lok Sabha Elctions: దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు... విరుచుకుపడిన సోనియాగాంధీ

ABN , Publish Date - Apr 06 , 2024 | 05:52 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు.

Lok Sabha Elctions: దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు... విరుచుకుపడిన సోనియాగాంధీ

జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) నిప్పులు చెరిగారు. దేశ గౌరవం, ప్రజాస్వామ్యానికి మోదీ తూట్లు పొడుస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. దేశ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దేశం గట్టి గుణపాఠం చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు.


ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో సోనియాగాంధీ మాట్లాడుతూ, తనను తాను ఒక గొప్పవ్యక్తిగా మోదీ భావించుకుంటూ దేశ గౌరవాన్ని, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. బీజేపీలో చేరాలని విపక్ష నేతలను బెదిరిస్తున్నారని, ఈరోజు దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని, ఇదంతా నియంతృత్వమేనని, దానికి కలిసికట్టుగా గుణపాఠం చెప్పాలని కోరారు.

Narendra Modi: 'ఫ్లాప్ చిత్రం' రిపీట్.. రాహుల్, అఖిలేష్ జోడీపై మోదీ వ్యంగ్యోక్తులు


ఈ ఎన్నికలు చాలా కీలకం: సచిన్ పైలట్

కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మాట్లాడుతూ, ఈసారి ఎన్నికలు ఎంతో నిర్ణయాత్మక ఎన్నికలని అన్నారు. రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడమే కేంద్ర ప్రభుత్వ విధానమని అన్నారు. రైతులకు కనీసమద్దతు ధర కల్పిస్తామని తొలిసారిగా మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్‌లో ప్రకటించారని, ఈ ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలని అన్నారు.


బీజేపీ హయాంలో విపక్షాలే టార్గెట్: ప్రియాంక

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖాండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రస్తావిస్తూ, కేంద్రంలోని బీజేపీ హయాంలో విపక్షాలు దాడులకు గురవుతున్నాయని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నాయని, రైతులు, పేదల గోడు వినే నాథుడే లేడని ఆక్షేపించారు. కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోకు ''న్యాయ్ పాత్ర'' అనే పేరు పెట్టిందని, ఇది ఎంతమాత్రం ఎన్నికల తర్వాత మరిచిపోయే ప్రకటనల జాబితా ఎంతమాత్రం కాదని, న్యాయం కావాలని కోరుకుంటున్న దేశప్రజల వాణి అని అన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 05:52 PM