Lok Sabha Opposition Leadr: రాహుల్ ససేమిరా.. ప్రతిపక్ష నేతగా ముగ్గురి పేర్లు పరిశీలన
ABN , Publish Date - Jun 17 , 2024 | 06:17 PM
లోక్సభలో విపక్ష నేతగా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ నిరాకరించినట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. కుమారి సెల్జా, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు పెంచుకోవడం, 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి బలం కూడా పెరగడంతో 18వ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) బాధ్యతలు తీసుకోనున్నారనే అంచనాలు బలంగా ఉన్నాయి. అయితే, విపక్ష నేతగా బాధ్యతలు తీసుకునేందుకు రాహుల్ నిరాకరించినట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ముగ్గురి పేర్లు పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. కుమారి సెల్జా, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
Rahul Gandhi: వయనాడ్ వదులుకోనున్న రాహుల్.. కీలక ప్రకటనకు రెడీ
ఇటీవల వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో 'ఇండియా' కూటమి 232 సీట్లు గెలుచుకోగా, వాటిలో కాంగ్రెస్ 99 సీట్లతో ఆధిక్యత చాటుకుంది. దీంతో లోక్సభలో ప్రతిపక్ష నేత పోస్ట్ కాంగ్రెస్కు ఖాయమైంది. రాహుల్ ఆ బాధ్యతలు తీసుకుంటే ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ లభించడంతో పాటు కూటమి నేతల మధ్య మంచి సమన్వయం సాధించే వీలుంటుందని కాంగ్రెస్ అభిప్రాయంగా ఉంది. అయితే అందుకు రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది. 2019లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత నుంచి రాహుల్ ఏ పదవిని చేపట్టేందుకు ఆసక్తి కనబరచడం లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..