Share News

Amit shah: సీఏఏపై తప్పుదారి పట్టిస్తున్న దీదీ... అమిత్‌షా ఆక్షేపణ

ABN , Publish Date - Apr 10 , 2024 | 03:01 PM

పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. సీఏఏ చట్టాన్ని కేంద్రం ఆమోదించిందని, కానీ సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే మీ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రజలను ఆమె తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.

Amit shah: సీఏఏపై తప్పుదారి పట్టిస్తున్న దీదీ... అమిత్‌షా ఆక్షేపణ

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. సీఏఏ చట్టాన్ని కేంద్రం ఆమోదించిందని, కానీ సీఏఏకు దరఖాస్తు చేసుకుంటే మీ పౌరసత్వాన్ని కోల్పోతారంటూ ప్రజలను ఆమె తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. శరణార్దులు సీఏఏ కింద దరఖాస్తు చేసుకోవాలని, అందువల్ల వారికి ఎలాంటి సమస్య రాదని తాను భరోసా ఇస్తున్నానని అమిత్‌షా చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని బలుర్ఘాట్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, మమతా దీదీ సీఏఏను ఎంతగా వ్యతిరేకించినా తాము మాత్రం శరణార్దులందరికీ పౌరసత్వం ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.


''సశక్త్ భారత్ నిర్మించాలంటే సశక్త్ బెంగాల్ నిర్మాణం జరగాలి. కానీ పశ్చిమబెంగాల్‌లో చొరబాట్లు ఏమేరకు చోటుచేసుకుంటున్నాయో చూసినప్పుడు, ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు రాష్ట్రం అభివృద్ధి కాదు. ఎన్నటికీ సాధికారత సాధ్యం కాదు'' అని అమిత్‌షా అన్నారు. చొరబాటులను ఆపేందుకు మమతా దీదీ ఎప్పుడైన పనిచేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఎంతమాత్రం లేదని, ఎందుకంటే చొరబాటుదార్లు ఆమెకు నిజమైన ఓట్‌బ్యాంక్ కావడమే దీనికి కారణమని ఆక్షేపించారు.

Ram Temple in Sukma: 21 ఏళ్ల తరువాత తెరుచుకున్న రామ మందిరం.. గ్రామస్తుల సంబరాలు..


మోదీకే సాధ్యం..

పశ్చిమబెంగాల్‌లో చొరబాట్లను ఆపాలంటే నరేంద్ర మోదీ, బీజేపీకి మాత్రమే సాధ్యమని అమిత్‌షా స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే మార్పు తథ్యమని చెప్పారు. అసోంలో తాము చొరబాటుదారులను నిలువరించామని చెప్పారు. బెంగాల్‌లో 30 సీట్లలో బీజేపీని గెలిపించి, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే చొరబాట్లకు అడ్డుకట్ట వేస్తామని, ఇది మోదీ గ్యారెంటీ అని భరోసా ఇచ్చారు.


కాగా, పశ్చిమబెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాలకు 7 విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లులో గెలుపొందగా, బీజేపీ 18 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ రెండు సీట్లు గెలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 03:27 PM