Share News

Narendra Modi: ఈడీ దాడులు, ఎలక్టోరల్ బాండ్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 15 , 2024 | 08:58 PM

లోక్‌సభ ఎన్నికల వేళ అనేక కీలకాంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు సోమవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు. ఈడీ దాడులు, ఎలక్టోరల్ బాండ్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, కాంగ్రెస్ మేనిఫెస్టో, సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు సహా పలు ప్రశ్నలకు మోదీ సూటిగా సమాధానం చెప్పారు.

Narendra Modi: ఈడీ  దాడులు, ఎలక్టోరల్ బాండ్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) వేళ అనేక కీలకాంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) 'ఏఎన్ఐ' వార్తా సంస్థకు సోమవారంనాడు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చారు. ఈడీ దాడులు, ఎలక్టోరల్ బాండ్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, కాంగ్రెస్ మేనిఫెస్టో, సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు సహా పలు ప్రశ్నలకు మోదీ సూటిగా సమాధానం చెప్పారు. ఆయన మాటల్లోనే ఆ హైలైట్స్‌ను ఓసారి చూద్దాం.

Electoral Bonds Scheme: ఎలక్టోరల్ బాండ్లపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు


1.అభివృద్ధి

-నాకు చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. నా నిర్ణయాలు ఎవరినో భయపట్టేందుకో, తగ్గించేందుకో కాదు. దేశ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించినవి. మూడో టర్మ్‌లో దేశ అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లడం నా లక్ష్యం.

2.విజన్ 2047

-విజయ్ 2047 అనేది కేవలం మోదీ విజన్ కాదు. దీని యాజమాన్య హక్కులు ఈ దేశానివే. ఇందుకోసం ఒక్క క్షణం కూడా నేను వృథా చేయదలచుకోలేదు.

3.ఈడీ కేసులపై..

-బీజేపీ ప్రభుత్వం జైళ్లకు పంపుతోందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రిజిస్టర్ చేసిన కేసుల్లో రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు, సంస్థలే గరిష్టంగా ఉన్నాయి. విపక్ష నేతలు ఎందరు జైలులో ఉన్నారు? ఎవరూ నాతో చెప్పలేదు కూడా. ఇదే విపక్ష నేత అక్కడ్నించే (జైలు) తమ ప్రభుత్వాన్ని నడపుతున్నారు. పాపభయం అనేది ఒకటుంది. నిజాయితీ పరులైతే భయం ఎందుకు? వాళ్లు మా హోం మంత్రిని నేను సీఎంగా ఉన్నప్పుడు జైలులో పెట్టారు. ఈడీ కేసుల్లో కేవలం 3 శాతం మందే రాజకీయ నాయకులు ఉన్నారు. తక్కిన 97 శాత కేసులకు రాజకీయాలకు సంబంధం లేదు. డ్రగ్స్ మాఫియా, అవినీతితో ప్రమేయం ఉన్న అధికారులు, బినామీ ఆస్తులు పోగుచేస్తున్న అధికారులు ఇందులో ఉన్నారు. వారిని జైలుకు పంపాం.

4. చట్టాలపై..

-ఏజెన్సీలను ప్రభావితం చేస్తున్నట్టు కొందరు చెబుతున్న వాటిలో ఒక్క చట్టం (ఈడీ, సీబీఐ ఫైలింగ్ కేసులు) కూడా మా ప్రభుత్వం తీసుకురాలేదు. ఎన్నికల కమిషన్ సంస్కరణలు మాత్రం మా ప్రభుత్వం తెచ్చింది. ఒక ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే వారినే ఎన్నికల కమిషనర్లుగా చేసి, ఆ తర్వాత రాజ్యసభ సీట్లు, మంత్రి పదవులు ఇచ్చారు. మేము (బీజేపీ) ఆ స్థాయి పనులు చేయలేదు.

5.ఒకే దేశం ఒకే ఎన్నికలు

-దీనికి మేము కట్టుబడి ఉన్నాం. పార్లమెంటులో కూడా దీనిపై మాట్లాడాం. కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కమిటీకి చాలామంది ప్రజలు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. కమిటీకి చాలా పాజిటివ్‌గా, సరికొత్త సూచనలతో స్పందనలు వచ్చాయి. నివేదికను అమలు చేస్తే దేశానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

6.ఎలక్టోరల్ బాండ్ల పథకంపై..

-ఎలక్టోరల్ బాండ్ల పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల్లో నల్లధనానికి ముకుతాడు వేసేందుకే ఈ పథకం తెచ్చాం. దర్యాప్తు సంస్థల చర్యలు తీసుకున్న తర్వాత 16 కంపెనీలు డొనేషన్లు ఇస్తే, దాంట్లో 37 శాతం మాత్రమే బీజేపీకి వచ్చాయి. 63 శాతం విపక్ష పార్టీలకు వచ్చాయి. ఎన్నికల బాండ్లు లేకపోతే అధికారం కోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడకు వెళ్లాలనే ఆలోచనే వస్తుంది. ఎలక్టోరల్ బాండ్స్ సక్సెస్ స్టోరీ వెనుక ఇంత కథ ఉంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోటుపాట్లు ఉండవని నేను ఎప్పుడూ చెప్పలేదు. వాటిని సవరించుకుని, మెరుగుపరుచుకుని వెళ్లాలి. ఇందుకు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

7. రాహుల్‌ గాంధీపై..

-దురదృష్టకరం ఏమిటంటే ఏ మాటకూ కట్టుబడి ఉండటం కానీ, బాధ్యతగా వ్యవహరించడం కానీ కనిపించదు. ఒక నాయకుడి పాత వీడియోలు చూస్తే ఆయన ప్రతీ ఆలోచన పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. దేశంలోని పేదరికాన్ని క్షణాల్లో నిర్మూలిస్తామని ఆయన చెబుతారు. 5-6 దశాబ్దాలు పాలించే అవకాశం వారికి వచ్చింది. జనం కూడా ఆ నాయకుడి మాటలపై లోతుగా ఆలోచిస్తున్నారు.

8. కాంగ్రెస్ మేనిఫెస్టో

-దేశంలోని యువ ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబిబించడంలో వారి మేనిఫెస్టో విఫలమైంది. ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఉంది. సూటిగా చెప్పాలంటే మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే యువకుల ఆకాంక్షలను బుగ్గిపాలు చేస్తుంది. 25 ఏళ్ల లోపు వారికి చాలా పెద్దనష్టమే జరుగుతుంది. వారి భవిష్యత్తును నాశనం చేస్తుంది.

9. సనాతన ధర్మ వ్యతిరేకత..

సనాతన ధర్మంపై విషం జల్లుతున్న వారిపై (డీఎంకే) కాంగ్రెస్ ఎత్తుకు పొత్తు పెట్టుకుంటోందో వారినే అగడండి. కాంగ్రెస్ మైండ్‌సెట్ ఏమిటి? ఇది దేశ ప్రజలను సైతం కలవరపెడుతోంది. డీఎంకే బహుశా విద్వేషంతోనే పుట్టిన పార్టీ కావచ్చు. అయితే ఇక్కడ ప్రశ్న అదికాదు. కాంగ్రెస్ లాంటి పార్టీ తమ బేసిక్ క్యారెక్టర్‌ను కోల్పోయిందా అన్నదే ప్రధాన ప్రశ్న.

10. ఉత్తరాది-దక్షిణాది విభజన

-ఇండియా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. గ్రామాల్లో అత్యధిక రామాలయాలు కలిగిన రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉందంటే అది తమిళనాడు. అలాంటి తమిళనాడును సెపరేట్ యూనిట్‌గా ఎలా చెబుతారు? భిన్నత్వం అనేది ఉంది. నాగాలాండ్ వ్యక్తి పంజాబ్‌ వ్యక్తిలా ఉండడు. కశ్మీర్ వ్యక్తి గుజరాతీలా ఉండడు. ఆ వైవిధ్యం, భిన్నత్వమే మన బలం. ఆ వైవిధ్యంలోని బలాన్ని మనం ఆస్వాదించాలి.

11.రామమందిరం

-రామమందిర అంశం అనేది విపక్షాలకు రాజకీయ ఆయుధం. ఇప్పుడు అది వారి చేతిల్లోంచి జారిపోయింది.

12. రాజ్యాంగంలో మార్పులపై..

-400 పైగా లోక్‌సభ సీట్లను బీజేపీ గెలిస్తే రాజ్యాంగంలో మార్పులు తెస్తుందని, దేశంలోని వైవిధ్యానికి గండి కొడుతుందని ఆరోపణలు విపక్షాల సృష్టే. విపక్షాలతోనే అసలు సమస్య. వారే ఈ భయాందోళలను పుట్టిస్తున్నారు. మేము వైరుధ్యాన్ని ఆరాధిస్తాం. సెలబ్రేట్ చేసుకుంటాం.

13.ఎలాన్ మస్క్ ప్లాన్‌పై..,

-ఎలాన్ మస్క్ ప్లాన్ ప్రకారం అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ తెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. అయితే ఇండియాలోని యువకులకు ఉపాధి కల్పించాలనేది మన ప్రధాన షరతు. ఇండియాకు పెట్టబడులు రావాలనేది నా కోరిక. ఎవరు డబ్బులు పెడతారనేది ఇక్కడ విషయం కాదు. వారి ఉత్పత్తులు ఈ గడ్డపై తయారు కావాలి. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు రావాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 08:59 PM