Share News

JMM accuse Modi: రాష్ట్రపతి నుంచుంటే..ప్రధాని కూర్చుంటారా?: జేఎంఎం ఆక్షేపణ

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:02 PM

దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణికి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.

JMM accuse Modi: రాష్ట్రపతి నుంచుంటే..ప్రధాని కూర్చుంటారా?: జేఎంఎం ఆక్షేపణ

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' (Bharat Ratna)ను బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణి(LK Advani)కి ప్రదానం చేస్తున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) నిలుచుని ఉండగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కూర్చుని ఉండటంపై జార్ఖాండ్ ముక్తి మోర్చా (JMM) ఆక్షేపణ తెలిపింది. ఆమె గిరిజన మహిళ అయినందునే రాష్ట్రపతిని ప్రధాని అవమానించారని విమర్శించింది.


అత్యున్నత రాజ్యాంగ పదవిలో ద్రౌపది ముర్ము ఉన్నప్పటికీ గిరిజన మహిళ అయినందునే ఉద్దేశపూర్వకంగానే ప్రధాని ఆమెను అవమానించారని జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య మీడియా సమావేశంలో ఆరోపించారు. ''రామరాజ్యం గురించి మాట్లాడేవారు ఇప్పుడు తమ అసురీ శక్తులను ప్రదర్శిస్తున్నారు. గిరిజనులు అంటే గౌరవం కానీ సాటి పౌరులనే విలువ కానీ పీఎంకు లేవని మేము చెప్పదలచుకున్నాం. అడ్వాణీకి పురస్కారం అందజేస్తున్నప్పుడు ఆయన పక్కన ప్రధాని కూర్చున ఫోటో చూశాం. రాష్ట్రపతి నిలుచుని అవార్డు ప్రదానం చేసారు. ఒక గిరిజన మహిళ అని కానీ, ఆమె పదవికి ఉన్న గౌరవాన్ని కానీ ప్రధాని పట్టించుకోలేదు. ఇది నిశ్చయంగా గిరిజన మహిళను, దేశ ప్రథమ పౌరురాలిని అవమానించడమే'' అని ఆయన అన్నారు.


కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి కానీ, అయోధ్యలో రామమందిర 'ప్రతిష్ఠాపన' కార్యక్రమానికి కానీ రాష్ట్రపతిని ఆహ్వానించలేదని, ఆమె గిరిజన మహిళ కావడమే ఇందుకు కారణమని సుప్రియో భట్టాచార్య ఆక్షేపణ తెలిపారు. వయోభారం కారణంగా భారతరత్న ప్రదానోత్సవానికి ఎల్‌కే అడ్వాణీ హాజరుకాకపోవడంతో రాష్ట్రపతి స్వయంగా ఆదివారంనాడు ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు. ప్రధానమంత్రి మోదీ, ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు.

Updated Date - Apr 02 , 2024 | 05:02 PM