Share News

National: నరేంద్రుడి ధ్యానమండపంలో.. నరేంద్రమోదీ ధ్యానం

ABN , Publish Date - May 31 , 2024 | 04:21 AM

తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు.

National: నరేంద్రుడి ధ్యానమండపంలో..  నరేంద్రమోదీ ధ్యానం

చెన్నై, మే 30 (ఆంధ్రజ్యోతి): తుది దశ ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 45 గంటల ధ్యానానికి కూర్చున్నారు. అంటే.. శనివారం (జూన్‌ 1) 7వ దశ పోలింగ్‌ అయిపోయే దాకా ఆయన ధ్యానముద్రలోనే ఉంటారన్నమాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు.

తెల్లటి ధోవతి, శాలువ ధరించి అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం అక్కణ్నుంచి ఫెర్రీలో కన్యాకుమారిలోని రాక్‌ మెమోరియల్‌ వద్దకు చేరుకున్నారు. ఒకవైపు బంగాళా ఖాతం.. మరోవైపు హిందూ మహాసముద్రం.. ఇంకోవైపు నుంచి అరేబియా సముద్రం.. ఇలా మూడు సాగరాలు కలిసే సంగమ స్థలి అది. 1886లో రామకృష్ణ పరమహంస నిర్యాణం అనంతరం.. ఆయన శిష్యుడైన వివేకానందుడు పరివ్రాజకుడిగా మారి దేశమంతటా పర్యటించి, 1892 నాటికి కన్యాకుమారికి చేరుకున్నారు.

అక్కడ మూడు సముద్రాలూ కలిసే చోట ఒక రాయిపై కూర్చుని మూడురోజులపాటు ధ్యానం చేశారు. అక్కడే ఆయనకు ఆధునిక భారతానికి సంబంఽధించిన దర్శనం జరిగిందని.. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలన్న నిర్ణయానికి ఆయన వచ్చింది అక్కడేనని అంటారు. ఆయన స్మత్యర్థం 1970లో అక్కడే రాక్‌ మెమోరియల్‌ నిర్మించారు.


వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్‌ దత్తా. అప్పట్లో ఆ నరేంద్రుడు ఎక్కడ కూర్చుని ధ్యానం చేశారో.. అక్కడే నిర్మించిన మండపంలో నరేంద్ర మోదీ గురువారం పద్మాసనంలో ధ్యానానికి కూర్చున్నారు. కాగా.. మోదీ రాకను నిరసిస్తూ తంతి పెరియార్‌ ద్రవిడర్‌ కళగం వంటి సంస్థలు నల్ల జెండాలతో ప్రదర్వన నిర్వహించాయి. ‘ఎక్స్‌’లో ‘గోబ్యాక్‌మోదీ’ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు వెల్లువెత్తాయి. మరోవైపు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం తమిళనాడులోని పుదుకోట జిల్లా ఉన్న పురాతన సత్యగిరీశ్వరర్‌ ఆలయంలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

2019లో..

ఎన్నికల ప్రచారం ముగిశాక 2019లో కూడా మే 19న తుదిదశ పోలింగ్‌ జరగ్గా, మే 18న మోదీ కాషాయ శాలువా ధరించి కేదార్‌నాథ్‌లోని రుద్రగుహలో 17 గంటలపాటు ధ్యానం చేశారు. ఇలా ధ్యానం చేయడం కూడా ఒక రకమైన ప్రచారం కిందకే వస్తుందని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమని, ప్రజల్లో ఒక వర్గాన్ని ప్రభావితం చేసే ప్రయత్నమేనని.. కాబట్టి, మోదీ ధ్యానానికి కూర్చున్న ఫొటోలు ప్రసారం, ప్రచురితం కాకుండా అడ్డుకోవాలని విపక్షాలు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Updated Date - May 31 , 2024 | 04:21 AM