Swati Malival: యూట్యూబర్ వీడియో తర్వాత నాకు బెదరింపులు ఎక్కువయ్యాయి..
ABN , Publish Date - May 26 , 2024 | 03:43 PM
సీఎం కేజ్రీవాల్ నివాసంలో దాడి అనంతరం తన క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు 'ఆప్' నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తాజాగా తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.
న్యూఢిల్లీ: సీఎం కేజ్రీవాల్ నివాసంలో దాడి అనంతరం తన క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు 'ఆప్' నేతలు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) తాజాగా తనకు అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. యూట్యూబర్ ధృవ్ రాథీ (Dhruv Rathee) తన క్యారెక్టర్ను దెబ్బతీసే విధంగా ఏకపక్షంగా విడియోలు పోస్ట్ చేశారని, ఈ వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత తనకు బెదరింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈమేరకు ఆదివారంనాడు ఆమె ట్వీట్ చేశారు.
''మా పార్టీ(ఆప్) నాయకులు, వలంటీర్లు నా క్యారెక్టర్పై బురదచల్లడం, అవమానించడం, నాపై భావోద్వేగాలను రెచ్చగొట్టడం వంటి ప్రచారం తర్వాత ఇప్పుడు రేప్, హత్య బెదరింపులు కూడా వస్తున్నాయి. యూట్యూబర్ ధృవ్ రాథీ ఏకపక్ష వీడియోలు పోస్ట్ చేసిన తర్వాత ఈ తరహా బెదిరింపులు తీవ్రమయ్యాయి'' అని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. పార్టీ నాయకత్వం తాను చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ బెదిరించే ప్రయత్నాలు చేస్తోందని మలివాల్ ఆరోపించారు. తనపై దాడి ఘటనను ధృవ్ రాథీతో పంచుకోవాలని, తన వెర్షన్ వినిపించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన తన ఫోన్కాల్స్కు, మెసేజ్లకు స్పందించడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసారు. స్వతంత్ర జర్నలిస్టులని చెపపుకునే రాథీ వంటి వాళ్లు "ఆప్'' ప్రతినిధులుగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటని అన్నారు. 2.5 నిమిషాల వీడియో ఆయన (రాథీ) పలు వాస్తవాలను ప్రస్తావించడంలో విఫలమయ్యారని అన్నారు.
Bangladesh : బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు స్మగ్లింగే కారణమా?
ఘటన జరిగినట్టు అంగీకరించిన పార్టీ ఆ తర్వాత యూ-టర్న్ తీసుకుందని, దాడి కారణంగానే గాయాలైనట్టు ఎంఎల్సీ నివేదిక ఇచ్చిందని ఆమె చెప్పారు. వీడియోలో ఎంపిక చేసిన భాగాలనే విడుదల చేశారని, నిందితుని ఫోన్ ఫార్మెట్ చేశారని తెలిపారు. క్రైమ్ సీన్ (సీఎం హౌస్) నుంచి నిందితుడిని అరెస్టు చేసినప్పుడు, తిరిగి అదే ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? సాక్ష్యాన్ని టాంపరింగ్ చేయడానికా అని ఆమె ప్రశ్నించారు. తనకు వస్తున్న అత్యాచారం, హత్య బెదిరింపులను ఢిల్లీ పోలీసులకు నివేదిస్తున్నానని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని స్వాతి మలివాల్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
Read National News and Latest News here