Share News

Maharashtra: శివసేన చీఫ్ ఆయనే...స్పీకర్ సంచలన నిర్ణయం

ABN , Publish Date - Jan 10 , 2024 | 06:51 PM

దాదాపు 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేనకు లేదని తేల్చిచెప్పారు.

Maharashtra: శివసేన చీఫ్ ఆయనే...స్పీకర్ సంచలన నిర్ణయం

ముంబై: దాదాపు 18 నెలలుగా స్పీకర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న శివసేన ఉద్ధవ్ థాకరే (Shiv Sena UBT) వర్గానికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) వర్గమే అసలైన శివసేన అంటూ స్పీకర్ రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) బుధవారంనాడు స్పష్టం చేశారు. శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (UBT)కి లేదని తేల్చిచెప్పారు. శివసేన పార్టీకి చీఫ్‌గా ఉద్ధవ్ థాకరేను కొనసాగించాలంటూ ఆ వర్గం నేతలు ఇచ్చిన ఫిర్యాదును తోసిపుచ్చారు. పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్‌నాథ్ షిండేను అడ్డుకోలేమని నార్వేకర్ స్పష్టమైన తీర్పునిచ్చారు.


శివసేన చీలిక నేపథ్యం..

ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనపై 2022 జూన్‌లో షిండే, పలువురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. దీంతో శివసేనలో చీలిక తలెత్తింది. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ప్రకటించడంతో ఉద్ధవ్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. షిండే ముఖ్యమంత్రిగా బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. షిండే సహా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని థాకరే వర్గం స్పీకర్‌కు ఫిర్యాదు చేయగా, తమదే నిజమైన శివసేన అంటూ థాకరే వర్గంపై వేటు వేయాలని షిండే వర్గం సైతం స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే షిండే శివసేనను అసలైన శివసేనగా ఎన్నికల సంఘం ప్రకటించి, ఆ వర్గానికే పార్టీ గుర్తును కూడా కేటాయించింది. కాగా, ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తేల్చిచెప్పాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం సైతం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ విసేంది. దీంతో ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లపై స్పీకర్ తుది నిర్ణయం ప్రకటించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తూ, జనవరి 10వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఎట్టకేలకు స్పీకర్ బుధవారంనాడు తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, 37 మంది ఎమ్మెల్యేల మద్దతు షిండే వర్గానికే ఉందని, ఆయన వర్గమే అసలైన శివసేన అని సంచలన తీర్పునిచ్చింది. స్పీకర్ తీర్పుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే కొనసాగేందుకు అడ్డంకులన్నీ తొలిగిపోయాయి.

Updated Date - Jan 10 , 2024 | 06:51 PM