Share News

AAP: కేజ్రీవాల్‌కు షాక్.. 'ఆప్' మంత్రి రాజీనామా

ABN , Publish Date - Apr 10 , 2024 | 06:55 PM

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి బుధవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా సమర్పించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన తొలి వ్యక్తి కూడా రాజ్‌కుమార్ ఆనంద్ కావడం విశేషం.

AAP: కేజ్రీవాల్‌కు షాక్.. 'ఆప్' మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ: 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) నేత, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ (Raaj Kumar Anand) తన మంత్రి పదవికి బుధవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా సమర్పించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన తొలి వ్యక్తి కూడా రాజ్‌కుమార్ ఆనంద్ కావడం విశేషం.


రాజ్‌కుమార్ ఆనంద్ 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పటేల్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రవేష్ రత్న్‌పై 30,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. 2022 నవంబర్‌లో మంత్రిగా పగ్గాలు చేపట్టారు. కార్మిక, ఉపాధి, ఎస్సీ, ఎస్సీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, కోఆపరేటివ్, గురుద్వారా ఎలక్షన్స్ కమిటీ అడిషనల్ బాధ్యతలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు.

Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం


రాజీనామాపై..

పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన అనంతరమే మీడియాతో ఆనంద్ మాట్లాడుతూ, ఆప్ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. అవినీతిపరులతో పనిచేయలేనని చెప్పారు. 'రాజ్‌నీతి బద్లేంగే తో దేశ్ బద్లేగా' అని కేజ్రీవాల్ చెప్పడంతో ఆయనకు దగ్గరయ్యానని, ఇవాళ రాజకీయాలు మారనప్పటికీ రాజకీయనేతలు మారారని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి తన రాజీనామాను పంపినట్టు చెప్పారు. పార్టీకి 13 మంది ఎంపీలు ఉన్నప్పటికీ వారిలో దళితులు, మహిళలు, బీసీలు ఒక్కరూ లేరని, దళిత ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, మంత్రులకు పార్టీలో ఎలాంటి గౌరవం లేదని ఆయన ఆరోపించారు. దళితులంతా తాము మోసానికి గురయ్యామని అనుకుంటున్నారని, దీంతో పార్టీలో కొనసాగడం తనకు కష్టంగా మారిందని వివరణ ఇచ్చారు.


ఈడీ రైడ్స్ జరిగిన భయంతోనే: ఆప్

రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ఆనంద్ నివాసంపై ఈడీ దాడులు జరిపిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆయన ఒత్తిడిలో, భయంలో ఉన్నారని అన్నారు. ఆయనకు స్క్రిప్టు రాసిచ్చారని, ఆ స్క్రిప్టు యధాతథంగా చదవడం మినహా ఆయనకు మరో గత్యంతరం లేకపోయిందన్నారు. దళిత ఎంపీ ఒక్కరూ లేరంటూ ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ, ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి దళిత నేతను అభ్యర్థిగా నిలబెట్టామని చెప్పారు. పార్టీని చీల్చి, ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీలను రద్దు చేసేందుకే అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని సౌరభ్ భరద్వాజ్ మీడియాకు వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 06:55 PM