Delhi: అబద్ధాలు వ్యాప్తి చేస్తున్న కాంగ్రెస్
ABN , Publish Date - May 03 , 2024 | 03:10 AM
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి సమాజంలో ఘర్షణ వాతావారణం సృష్టిస్తోందంటూ బీజేపీ గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు
న్యూఢిల్లీ, మే 2: కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి సమాజంలో ఘర్షణ వాతావారణం సృష్టిస్తోందంటూ బీజేపీ గురువారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజ్యాంగాన్ని మార్చివేసేందుకే 400 ఎంపీ సీట్లు కావాలని కోరుకుంటోందంటూ తమపై అసత్యాలు వాప్తి చేస్తోందని తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ అబద్ధాలు చేబుతోందని ఆరోపించింది.
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది, పార్టీ నాయకుడు ఓం ప్రకాశ్ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు అందజేశారు. కాంగ్రె స్తో పాటు ఇండియా కూటమి పార్టీలు డీప్ ఫేక్ వీడియోలను ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం సుధాంశు త్రివేది విలేకరులతో మాట్లాడుతూ మొత్తం 15 సంఘటనలను ఈసీ దృష్టికి తెచ్చామని చెప్పారు. స్వేచ్ఛగా, నిజాయితీగా ఎన్నికలు జరగకుండా కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.