Share News

మత్తు మజా.. మస్త్‌ మజా..!

ABN , Publish Date - May 21 , 2024 | 06:02 AM

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఫాంహౌస్‌లో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

మత్తు మజా.. మస్త్‌ మజా..!

హైదరాబాద్‌ వ్యాపారి బర్త్‌ డే సందర్భంగా

బెంగళూరులోని ఫాం హౌస్‌లో రేవ్‌ పార్టీ..

పార్టీలో ఏపీ రాజకీయ, సినీ ప్రముఖులు

బెంగళూరు, హైదరాబాద్‌ సిటీ, మే 20(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఫాంహౌస్‌లో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు. పార్టీలో భారీగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు బెంగళూరు సీసీబీ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ ఫాంహౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలతోపాటు.. టాలీవుడ్‌, సీరియల్‌ నటులు, మోడల్స్‌ మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌ వ్యాపారి.. బెంగళూరు ఎలకా్ట్రనిక్‌ సిటీ పరిధిలోని జీఆర్‌ ఫాంహౌస్‌లో బర్త్‌ డే పార్టీ పేరుతో రహస్యంగా రేవ్‌ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన పార్టీ రాత్రి 12 గంటలకు ముగియాల్సి ఉన్నా.. ఆ తర్వాత కూడా డీజేలతో హోరెత్తించడంతో స్థానికులు హెబ్బగూడి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో బెంగళూరు సీసీబీ (సిటీ క్రైమ్‌ బ్రాంచి) పోలీసులు ఈ ఫాంహౌస్‌పై దాడి చేసి పార్టీలో పాల్గొన్న సుమారు 100మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 75 శాతం మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వాసులని వారిలో రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని సమాచారం.


కన్నడ సీరియల్‌ నటులతోపాటు 20 మందికిపైగా మోడల్స్‌ పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో 17 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్‌తోపాటు 15 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్‌ ఉన్న కారు సైతం లభ్యమైందని తెలిసింది. ఐతే.. ఈ ఆరోపణలను కాకాణి ఖండించారు. ఆ కారుతో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. ఎలక్ర్టానిక్‌ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ పార్టీలో పాల్గొన్న 30 మంది యువతులు, 70 మంది యువకులు ఏపీ, హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చినట్టు తెలుస్తోంది. ఈవెంట్‌ కోసం ఫౌంహౌస్‌ నిర్వాహకులకు రూ.30 నుంచి రూ.50 లక్షలు చెల్లించినట్టు సమాచారం. రేవ్‌ పార్టీలో పాల్గొన్న వారిలో సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతమంది ఉన్నారు..? ఎవరెవరు డ్రగ్స్‌ తీసుకున్నారు..? అనేది తెలియరాలేదు. అందుకోసం మెడికల్‌ టెస్టులు నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.


  • పార్టీలో లేనన్న హేమ... ఉందన్న పోలీసులు?

పార్టీలో పాల్గొన్న వారిలో టాలీవుడ్‌ సినీ నటులు, టీవీ నటులు, మోడల్స్‌ ఉన్నట్లు తేలడంతో పాటు.. ప్రముఖ తెలుగు నటి హేమ కూడా ఉన్నారని మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో హేమ.. తాను రేవ్‌ పార్టీలో పాల్గొనలేదని, హైదరాబాద్‌లోనే చిల్‌ అవుతున్నానని ఓ వీడియో రిలీజ్‌ చేశారు. అయితే సాయంత్రానికి నటి హేమ తమ అధీనంలోనే ఉందని బెంగళూరు పోలీసులు వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి. హేమ రిలీజ్‌ చేసిన వీడియో నిజం కాదని, అందరినీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపినట్టు సమాచారం.

  • పార్టీలకు వెళ్లే అలవాటు లేదు: శ్రీకాంత్‌

రేవ్‌పార్టీలో పట్టుబడిన వారిలో ప్రముఖ తెలుగు సినీనటుడు శ్రీకాంత్‌ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో వెంటనే స్పందించిన శ్రీకాంత్‌.. హైదరాబాద్‌లోని తన ఇంటి వద్ద నుంచి ఒక వీడియో విడుదల చేశారు. నాకు పార్టీలకు, పబ్‌లకు వెళ్లే అలవాటులేదని పేర్కొన్నారు. ఎక్కడైనా బర్త్‌డే పార్టీలకు వెళ్లినా కొద్దిసేపు ఉండి వెంటనే వచ్చేస్తానన్నారు. బెంగళూరులో పట్టుబడ్డ వారిలో ఒక వ్యక్తి నాలాగే కనిపించడంతో మీడియా మిత్రులు పొరపడి ఉంటారన్నారు

Updated Date - May 21 , 2024 | 06:08 AM