Share News

Yemen: రెచ్చిపోయిన హౌతీలు.. నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి.. అండగా నిలిచిన భారత్

ABN , Publish Date - Apr 29 , 2024 | 07:50 AM

ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది.

Yemen: రెచ్చిపోయిన హౌతీలు.. నౌక, అమెరికా డ్రోన్‌పై దాడి.. అండగా నిలిచిన భారత్

ఎర్రసముద్రం: ఎర్రసముద్రంలో యెమెన్ (Yemen) హౌతీలు (Houthi Rebels) మళ్లీ రెచ్చిపోయారు. గాజా - ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ.. యెమెన్ హౌతీలు ఎర్రసముద్రంలోని ఓ నౌకపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో చమురు ట్యాంకర్ దెబ్బతింది. అమెరికాకు చెందిన డ్రోన్‌ని సైతం కాల్చివేశారని అల్ జజీరా నివేదించింది. హౌతీల సైనిక ప్రతినిధి యాహ్యా సారీ ఎర్ర సముద్రంలో నావికా క్షిపణులతో బ్రిటిష్ చమురు నౌక "ఆండ్రోమెడా స్టార్"ని లక్ష్యంగా చేసుకున్నాడు.

US సెంట్రల్ కమాండ్ (CENTCOM) వివరాల ప్రకారం.. నౌకకు స్వల్ప నష్టం వాటిల్లింది. అయితే నౌకకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. గగనతలంలో శత్రు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు యూఎస్ మిలిటరీకి చెందిన MQ-9 రీపర్ డ్రోన్‌‌ని కాల్చివేశారని అధికారులు చెబుతున్నారు. తమ డ్రోన్‌పై దాడి జరిగిందని అమెరికా మిలిటరీ నిర్ధారించింది.


దీనిపై విచారణ జరుపుతున్నట్లు తెలిపింది. గాజాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హౌతీలు కాల్చివేసిన మూడో అమెరికా డ్రోన్ ఇది. ఈ ఏడాది ఫిబ్రవరిలో, 2023 నవంబర్‌లో హౌతీలు డ్రోన్లపై దాడి చేశారు. యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (UKMTO).. యెమెన్‌లోని అల్-ముఖా (మోచా) సమీపంలో ఎంవీ ఆండ్రోమెడా స్టార్ ఓడపై దాడులను నిర్ధారించింది. మొదటి పేలుడు నౌకకు సమీపంలో సంభవించిందని, రెండోసారి జరిపిన దాడిలో నౌక ధ్వంసం అయినట్లు తెలిపింది. హౌతీ సైన్యం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో "ఇజ్రాయెల్ నౌక MSC డార్విన్"ని లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ దక్షిణ ఓడరేవు నగరమైన ఈలాట్‌లోని లక్ష్యాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది.


అంతకుముందు అమెరికా జెండా ఉన్న మెర్స్క్ యార్క్‌టౌన్, ఇజ్రాయెల్-లింక్డ్ MSC వెరాక్రూజ్‌లపై దాడి చేశారు. హౌతీ ఈ దాడులతోనే ఆగదని.. మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని అమెరికా భావిస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ తమ దాడిని నిలిపివేస్తే, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాలలో దాడులను ఆపేస్తామని హౌతీలు ప్రతిజ్ఞ చేశారు.

ఈ దాడులు ప్రపంచ వాణిజ్యానికి అంతరాయం కలిగించడమే కాకుండా ఇజ్రాయెల్‌లోని ఈలాట్ పోర్ట్ వద్ద ట్రాఫిక్‌ను ప్రభావితం చేశాయి. యెమెన్‌లోని హౌతీ-నియంత్రిత ప్రాంతాలలో సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి వారం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.


భారత్ పర్యవేక్షణ..

హూతీ వేర్పాటువాదుల క్షిపణి దాడికి గురైన ఎంవీ ఆండ్రోమేడా స్టార్‌ నౌకకు అండగా నిలిచింది. దాడి సమాచారం అందగానే నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ కోచి స్పందించింది. ఆ నౌక దగ్గరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించింది.

అందులోని 22 మంది భారతీయులు సహా 30 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు ధ్రువీకరించింది. నౌక భద్రతా పరిస్థితినీ ఐఎన్‌ఎస్‌ కోచిలోని నిపుణుల బృందం అంచనా వేసింది. అనంతరం నౌక ప్రయాణానికి సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రకటించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 29 , 2024 | 07:52 AM