Share News

AP Election 2024: అనుమానం ఉంది ఆపండి.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు కీలక లేఖ

ABN , Publish Date - May 16 , 2024 | 06:24 PM

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు.

AP Election 2024: అనుమానం ఉంది ఆపండి.. గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు కీలక లేఖ

అమరావతి: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారాన్ని నిలిపివేయాలని కోరారు. ఈ నెల 17 నుంచి 25 వరకు అప్‌గ్రేడ్ పేరుతో ఈ-ఆఫీస్ మూసివేతపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. పారదర్శకత పాటించని వైసీపీ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


లేఖలోని అంశాలు ఇవే..

‘‘ ఈ-ఆఫీస్ వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేయడం వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ-ఆఫీస్ ఈ నెల 17 నుంచి 25 వరకు అందుబాటులో ఉండదు. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీల్లో అనుమానాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్‌సైట్‌లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోంది. అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్‌ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదు. 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ-ఆఫీస్ మూసివేత, అప్ గ్రేడ్ ప్రక్రియను కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా నిలిపివేయాలని సీఎస్‌ను ఆదేశించాలి’’ అని చంద్రబాబు నాయుడు కోరారు.


ఇప్పటికే కీలక రికార్డులు మాయం

ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందని పేర్కొన్నారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈవోకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు. ‘‘ఈ నేపథ్యంలో అన్ని ఫైల్‌లు, నోట్ ఫైల్‌లు, రికార్డ్‌లు మాయం కాకుండా భద్రపరచాలి. అన్ని హెచ్‌వోడీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్న చోట పరిశీలన చేయాలి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలి’’ అని లేఖలో చంద్రబాబు కోరారు.

Updated Date - May 16 , 2024 | 06:24 PM