Share News

New Rules 2024: నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నియమాలివే!

ABN , Publish Date - Jan 01 , 2024 | 02:23 PM

నూతన సంవత్సరం సందర్భంగా నేటి నుంచి బీమా పాలసీలు, సిమ్ కార్డులు, వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు ఈ గణనీయమైన మార్పులను గమనించడం మంచిది.

New Rules 2024: నేటి నుంచి అమల్లోకి వచ్చే కొత్త నియమాలివే!

నూతన సంవత్సరం సందర్భంగా నేటి నుంచి బీమా పాలసీలు, సిమ్ కార్డులు, వ్యక్తిగత ఫైనాన్స్ విషయంలో కొత్త నియమాలు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా పన్ను చెల్లింపుదారులు, పెట్టుబడిదారులు ఈ గణనీయమైన మార్పులను గమనించడం మంచిది.

బీమా సమగ్ర పాలసీ ఫీచర్ వివరాలు

నూతన సంవత్సరంలో బీమా కంపెనీలు తమ పాలసీదారులకు కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ (CIS)ని అందజేస్తాయని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తెలిపింది. సంక్లిష్ట పాలసీ వివరాలను సరళీకృతం చేయడానికి, పాలసీదారులకు వారి బీమా కవరేజీపై స్పష్టమైన అవగాహనను అందించే ప్రయత్నంలో ఈ షీట్‌ను రూపొందించారు. ఇందులో భాగంగా బీమా మొత్తం, కవరేజీ ప్రత్యేకతలు, మినహాయింపులు, క్లెయిమ్‌ల ప్రక్రియ వంటి ముఖ్యమైన పాలసీ వివరాలను బీమా కంపెనీలు పాలసీదారులకు అందజేస్తాయి. కాగా సవరించిన కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్లు (CIS) నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ‘‘ పాలసీ పత్రం చట్టబద్ధతతో ఉంటుంది. పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, సాధారణ పదాల్లో అవసరమైన మేరకు ఉండటం తప్పనిసరి’’ అని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

2024లో బీమా ట్రినిటీ

బీమా ట్రినిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ సంవత్సరం బీమా సుగం, బీమా విస్టార్, బీమా వాహక్ సేవలు వేర్వేరు వ్యవధిలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బీమా సుగమ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌గా మారనుంది. ఇందులో కస్టమర్‌లు వివిధ కంపెనీలు అందించే బహుళ ఎంపికల నుంచి తగిన పథకాన్ని ఎంచుకోవచ్చు. బీమా విస్టార్ అనేది ప్రజలకు రక్షణ అందించడానికి ప్రయత్నిస్తున్న ఓ విప్లవాత్మక బీమా ఉత్పతి. ఇది జనవరి 2024 చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. బీమా వాహక్ అనేది గ్రామ సభ స్థాయిలో మహిళా-కేంద్రీకృత పంపిణీ ఛానల్. ఇది మహిళలకు సమగ్ర బీమా ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తుంది. దీని ద్వారా వారికి ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.


సిమ్ కార్డుల కొనుగోలు, అమ్మకం

కొత్త టెలికాం బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత సిమ్ కార్డుల కొనుగోలు, నిర్వహణ, వాటిని విక్రయించే పద్దతులు మారనున్నాయి. 2023లో పెరిగిన స్పామ్, స్కామ్‌లు, ఆన్‌లైన్ మోసాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సిమ్ కార్డుల కొనుగోలు ప్రక్రియలో ఈ గణనీయమైన మార్పులు జనవరి 1, 2024 నుంచి అమలుల్లోకి వచ్చాయి.

మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారుల నామినేషన్ గడువు

మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులు జూన్ 30, 2024లోపు లబ్ధిదారుని నామినేట్ చేయాలి. లేదా దాని నుంచి వైదొలగాలి. ఇన్వెస్టర్లు నామినేషన్ గడువును కోల్పోతే, సెబీ వారి హోల్డింగ్‌ల నుంచి డెబిట్‌లను స్తంభింపజేయవచ్చు. దీని అర్థం పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఉపసంహరించుకోలేరు లేదా ట్రేడింగ్ కోసం వారి డీమ్యాట్ ఖాతాలను ఉపయోగించలేరు.

మార్చి 14లోపు ఆధార్ అప్‌డేట్

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మార్చి 14, 2024 వరకు ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేయడానికి అనుమతించింది. అయితే myAadhaar పోర్టల్‌లో మాత్రమే సేవలు ఉచితం. ఫిజికల్ ఆధార్ కేంద్రాల్లో కార్డుదారులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ముందస్తు పన్ను చెల్లింపు

అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఆదాయాన్ని ఆర్జించిన అదే ఆర్థిక సంవత్సరంలో చెల్లించే పన్ను. ఏడాది పొడవునా నాలుగు వాయిదాల్లో పన్ను చెల్లిస్తారు. జూన్ 15 నాటికి, మొత్తం పన్ను బాధ్యతలో 15% చెల్లించాలి. ఇది సెప్టెంబర్ 14 నాటికి 45% కు పెరుగుతుంది. డిసెంబర్ 15 నాటికి జూన్, సెప్టెంబర్ వాయిదాలతో సహా పన్ను చెల్లించాల్సిన బాధ్యత 75%గా ఉంది. చివరగా మార్చి 15 నాటికి ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మొత్తం పన్ను (15% + 30% + 30% + 25%) చెల్లించాలి.

Updated Date - Jan 01 , 2024 | 02:23 PM