Share News

Janasena: పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా

ABN , Publish Date - Feb 13 , 2024 | 09:38 PM

హెలికాప్టర్ ల్యాండింగ్‌కి అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు.

Janasena: పవన్ కళ్యాణ్  భీమవరం పర్యటన వాయిదా

అమరావతి: హెలికాప్టర్ ల్యాండింగ్‌కి అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బీ శాఖ మోకాలడ్డిందని మండిపడ్డారు. ఈ కారణంతో రేపు (బుధవారం) చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా వేశామని చెప్పారు. పవన్ పర్యటన ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియచేస్తామని అన్నారు.

పర్యటనకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారని ధ్వజమెత్తారు. దూరంగా ఉన్న టవర్‌ను సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. గతంలో లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అమలాపురంలోనూ ఆర్ అండ్ బీ అధికారులతో అనుమతుల విషయంలో మెలికలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం ఇలా వాడుకుంటున్నారని మహేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


హాస్యాస్పదంగా ఆర్అండ్‌బీ అధికారుల తీరు: కొటికలపూడి గోవిందరావు

భీమవరం: భీమవరంలో రేపు(బుధవారం) జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు అయిందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... హాస్యాస్పదంగా ఆర్అండ్‌బీ అధికారులు హెలిప్యాడ్‌కు అనుమతులు ఇవ్వకపోవడమే కారణమని ఓ ప్రకటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ నాయకులు వత్తిడితో వంకలు చెపుతూ అనుమతి ఇవ్వలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనను ఎదుర్కోలేక వైఎస్సార్ సీపీ చేతగానితనం, కుట్రగా భావిస్తున్నామని చెప్పారు.

అధికార పార్టీకి అడ్డురాని నిబంధనలు ఆర్ అండ్‌బీ అధికారులు ఇప్పుడు తన పర్యటనకు మాత్రమే చెబుతున్నారని ధ్వజమెత్తారు. టెక్నాలజీ పెరిగినా అధికారులు పరిగణనలోకి తీసుకోలేదన్నారు.కావాలని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం పిరికిపంద చేష్టలుగా భావిసున్నామన్నారు. త్వరలోనే తేదీ ప్రకటించి పవన్ కల్యాణ్ భీమవరం వస్తారని అన్నారు. వైసీపీ నియంతృత్వ పోకడలకు భీమవరం నుంచే పతనం ప్రారంభమవుతుందని గోవిందరావు హెచ్చరించారు.

Updated Date - Feb 13 , 2024 | 09:39 PM