AP Politics: పవన్తో వైసీపీ ఎమ్మెల్యే భేటీ.. వెంటనే వైసీపీ అధిష్ఠానం ఏం చేసిందంటే..
ABN , Publish Date - Mar 04 , 2024 | 03:38 AM
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు.
ఈ వారంలోనే జనసేనలోకి శ్రీనివాసులు
పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ
అమరావతి/చిత్తూరు, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ను హైదరాబాద్లో కలిశారు. వైసీపీలో సీఎం జగన్ తనకు అన్యాయం చేశారని.. 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన తనను అవమానించారని శ్రీనివాసులు చెప్పారు. తనకు అవకాశం కల్పిస్తే రాజంపేట లోక్సభ స్థానంలో పోటీకి సిద్ధమని తెలిపినట్లు తెలిసింది. ఆయన పార్టీలో చేరేందుకు అంగీకరించిన పవన్.. టికెట్ విషయమై ఆలోచిస్తామని, సర్వే రిపోర్టులు కూడా పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. నాలుగు రోజుల్లో ఆయన పార్టీలో చేరనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఆయన్ను జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ పార్టీ అధినేత వద్దకు తీసుకెళ్లారు. ఆయన రాకతో రాయలసీమలో పార్టీ బలం పుంజుకుంటుందని కిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. పవన్తో భేటీ అయిన ఆరణి శ్రీనివాసులును వైసీపీ నాయకత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీనివాసులును కాదని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులున్న ఆర్టీసీ మాజీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డిని గత నెలలోనే చిత్తూరు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించింది. ఆయన్ను రాజ్యసభకు పంపిస్తామని ప్రకటించి.. చివరిలో మొండిచేయి చూపించి మేడా రఘునాథరెడ్డికి అవకాశమిచ్చింది. కాగా, రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పుడు ఎక్కడా వైసీపీ అసెంబ్లీ ఇన్చార్జుల్లో బలిజ సామాజిక వర్గానికి చెందినవారు లేరు. చిత్తూరులో ఆరణిని కాదని విజయానందరెడ్డికి ఇచ్చినట్లే.. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను కాదని శివప్రసాద్రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఈ ఆరు జిల్లాల్లో ఇద్దరు బలిజ ఎమ్మెల్యేలను కాదని వైసీపీ అధిష్ఠానం రెడ్డి సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వడంపై బలిజ సంఘం నాయకులు ఆగ్రహంతో ఉన్నారు.