Share News

YSRCP Vs TDP: బరితెగించిన బాలినేని వర్గం!

ABN , Publish Date - Apr 11 , 2024 | 08:55 AM

AP Elections: ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వలంటీర్‌ ఉండటాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావుపైనా, మరికొందరిపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో కిందపడిపోయిన మోహన్‌రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడంతో మూడుగంటలపాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...

YSRCP Vs TDP: బరితెగించిన బాలినేని వర్గం!

  • ఇంటింటి ప్రచారానికి వైసీపీ శ్రేణులతో వలంటీరు

  • ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడి

  • ఒంగోలులో వైసీపీ మూకల రౌడీయిజం

  • ఇదేమన్న టీడీపీ నాయకుడిపైనా దాడి

  • రిమ్స్‌కు తరలిస్తే అక్కడా రణరంగం

  • బాధితులతో కలిసి వచ్చిన టీడీపీ నేత దామచర్ల

  • భారీగా అనుచరులతో ఎమ్మెల్యే

  • బాలినేని, కొడుకు ప్రణీత్‌రెడ్డి రాక

  • అద్దాలు పగలగొట్టిన వైసీపీ శ్రేణులు

  • తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల చోద్యం

ఒంగోలు (కార్పొరేషన్‌), ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 10:

ఒంగోలులో వైసీపీ (YSRCP) నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వలంటీర్‌ ఉండటాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావుపైనా, మరికొందరిపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో కిందపడిపోయిన మోహన్‌రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడంతో మూడుగంటలపాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంతటితో ఆగక, గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తే అక్కడా రణరంగం సృష్టించారు. వైసీపీ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు అక్కడికి వచ్చి మరింత రెచ్చగొట్టారు. ఆస్పత్రి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేశారు. వివరాలివీ.. నగరంలోని సమతానగర్‌లో బుధవారం వైసీపీ తరఫున ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులోభాగంగా హిమశ్రీ అపార్ట్‌మెంట్‌లోని చప్పిడి ప్రభావతి ఇంటికెళ్లారు.

ఇంట్లో ఉన్న ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె వలంటీర్‌ ఎందుకొచ్చారని ప్రశ్నించడంతో వారిపై దౌర్జన్యం చేశారు. దీంతో ఫొటో తీయబోయిన ప్రభావతిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకున్న ఆమె కుమారులను తీవ్రంగా కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్‌రావు అక్కడికి చేరుకుని వైసీపీ వాళ్లని ప్రశ్నించారు. అదే సమయంలో బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ యువజన నాయకుడు గంటా రామానాయుడు, వైసీపీ బీసీ విభాగం నాయకుడు గోలి తిరుపతిరావుతోపాటు మరో 30మంది ఒక్కసారిగా మోహన్‌రావును చుట్టుముట్టారు. మోహన్‌రావుపై దాడిచేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సర్దిచెప్పేందుకు చూడగా వారిపైనా దాడిచేశారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌తోపాటు, టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మద్యం మత్తులో ఉన్న వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మీసం మెలేసి, తొడలు కొట్చి రెచ్చగొట్టే వాఖ్యలు చేయడంతో పరిస్థితి చేయిదాటింది. స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. పోలీసులు భారీగా వచ్చినా వైసీపీ కవ్వింపు చర్యలు, సవాళ్లను అదుపుచేయకుండా ప్రేక్షకపాత్ర వహించారు. సమతానగర్‌లో సామాన్యులు, టీడీపీ నాయకుడిపై దాడులకు పాల్పడిన అనంతరం వైసీపీ నాయకులు రోడ్లపై వీరంగం చేశారు.


Balineni--Fight.jpg

శ్రేణులను రెచ్చగొట్టిన బాలినేని

బాధితులతో సహా ఎస్పీని కలిసిన టీడీపీ నేతలు వారిని కూడా చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తుండగా అదే సమయంలో వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతడి తనయుడు ప్రణీత్‌రెడ్డి, సుమారు 500మంది వారి అనుచరులు కూడా రావడంతో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం తమపైనే టీడీపీ వారు దాడిచేశారంటూ ఇద్దరు యువకులను రిమ్స్‌లో చేర్చారు. బాధితులు ఫిర్యాదు చేయకుండా అడ్డుకునేందుకు వివాదాస్పదంగా వ్యవహరించారు. ఏకంగా రిమ్స్‌లోనే రణరంగం సృష్టించారు. ఆస్పత్రి అనే విచక్షణ కూడా లేకుండా.. బాలినేని వాసు జిందాబాద్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడ ఉన్న వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ ఆస్పత్రి అద్దాలను ధ్వంసం చేశారు. వైద్యసిబ్బందిపైనా దౌర్జన్యం చేశారు. కొంతమంది మద్యం మత్తులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ వాహనంపై దాడికి యత్నించారు. ఇంతా జరుగుతున్నా అక్కడ ఉన్న పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. రాత్రి 12గంటల సమయంలో ఏఎస్పీ నాగేశ్వరరావు అదనపు బలగాలతో అక్కడకు చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అన్ని లెక్కలూ తేలుస్తాం

ఓటమి భయంతో ఏమిచేయాలో అర్థం కాక ఇలా ఓటర్ల ఇళ్లపైనా, టీడీపీ నాయకులపై దాడులు చేస్తే భయపడిపోతారని అనుకోవడం వైసీపీ నాయకుల అవివేకమని దామచర్ల జనార్దన్‌ అన్నారు. అధికారంలోకి రాగానే అన్ని లెక్కలూ తేలుస్తామని హెచ్చరించారు. దీనిపై ఎంపీ మాగుంటతో ఎస్పీని కలిసి నిందితులపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులుూన్యాయం కోసం ఆందోళన చేపట్టాయి.

Updated Date - Apr 11 , 2024 | 08:56 AM