AP Govt : అప్పుల వేటలో ఏపీఎండీసీ
ABN , Publish Date - Dec 27 , 2024 | 04:19 AM
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) అప్పుల వేటలో పడింది. కొత్త ప్రాజెక్టుల నిర్వహణకు రూ.5వేల కోట్ల నిధుల సమీకరణ(అప్పులే) చేయాలనుకుంటోంది.

5వేల కోట్ల సమీకరణకు ప్రభుత్వ అనుమతి
అమరావతి, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) అప్పుల వేటలో పడింది. కొత్త ప్రాజెక్టుల నిర్వహణకు రూ.5వేల కోట్ల నిధుల సమీకరణ(అప్పులే) చేయాలనుకుంటోంది. ఇందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు సలహాదారుగా ఓ మర్చంట్ బ్యాంక్ను నియమించేందుకూ అనుమతిస్తూ గనులశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్కుమార్ మీనా ఉత్తర్వులు(జీవో 97) జారీ చేశారు. అప్పులు ఎలా తేవాలి? ఎలా ఖర్చుపెట్టాలి? కొత్తగా ఏ ఏ ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టాలి? తదితర అంశాలపై సూచనలు, సలహాలు ఇవ్వడానికి మర్చంట్ బ్యాంకర్ కావాలని ఎండీసీ భావిస్తోంది. ఇందుకోసం టెండర్లు పిలిచి, ఆసక్తి ఉన్న మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్లను ఎండీసీ స్వీకరించాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ కోసం టెండర్ డాక్యుమెంట్(రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) తయారీ, టెండర్ల నిర్వహణ కోసం నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎండీసీ ఎండీ, ఈడీ, గనుల శాఖ డిప్యూటీ సెకట్రరీ, ఎండీసీలో జనరల్ మేనేజర్, పీపీపీ నిపుణుడు షలీమ్రాజు, ఎండీసీ ఫైనాన్స్ డీజీఎంలు సభ్యులుగా ఉంటారు. కేవలం ఎండీసీ అవసరాల కోసమే ఈ నిధుల సమీకరణ చేయాలనుకుంటున్నట్టు ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 20వ తేదీన జరిగిన ఎండీసీ బోర్డు సమావేశంలో 5వేల కోట్ల నిధుల సమీకరణ ప్రతిపాదనపై చర్చించి తీర్మానం చేసింది. ఈ తీర్మానం ఆధారంగానే ప్రభుత్వం నిధుల సమీకరణకు అనుమతి ఇచ్చింది.