Share News

AP NEWS: వైసీపీ నేత స్కెచ్.. భూమిని కాజేసేందుకు ఏం చేశాడంటే?

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:35 PM

జిల్లాలో ఓ భూమిపై వైసీపీ నేత కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఆ భూ యజమానిపై మొదట బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత అతను మాట వినడం లేదని భయాందోళనలకు గురిచేశాడు. ఇప్పుడు ఏకంగా అతనిపై హత్యయత్నానికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే... తాడిమర్రి మండలం నిడిగల్లు సమీపంలో 3.84 ఎకరాలను రాము నాయక్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు.

AP NEWS: వైసీపీ నేత స్కెచ్.. భూమిని కాజేసేందుకు ఏం చేశాడంటే?

అనంతపురం: జిల్లాలో ఓ భూమిపై వైసీపీ నేత కన్ను పడింది. అనుకున్నదే తడవుగా ఆ భూ యజమానిపై మొదట బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత అతను మాట వినడం లేదని భయాందోళనలకు గురిచేశాడు. ఇప్పుడు ఏకంగా అతనిపై హత్యాయత్నానికి దిగాడు. వివరాల్లోకి వెళ్తే... తాడిమర్రి మండలం నిడిగల్లు సమీపంలో 3.84 ఎకరాలను రాము నాయక్ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అయితే ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రికు చెందిన వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి కన్ను ఆ భూమిపై పడింది. ఆ భూమి తనకు కావాలని భూ యజమానిపై బెదిరింపులకు దిగాడు. అయితే.. ఎంత బెదిరించినా రాము నాయక్ వినకపోవడంతో.. అతడిపై వైసీపీ నేత హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన అనుచరుల చేత ఆటోతో ఢీకొట్టి, రాముని చంపడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని ఉప్పరపల్లి సమీపంలో జరిగింది.

ఈ ప్రమాదం నుంచి రాము నాయక్ తృటిలో తప్పించుకున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి మనుషులే తనపై హత్యాయత్నం చేశారని బాధితుడు ఆరోపించాడు. ఆ భూమిని కబ్జా చేసేందుకు చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ చెప్పాడు. పోలీసుల చేత తనపై ఒత్తిడి తీసుకొచ్చి బెదిరిస్తున్నారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడు వెంకటరాముడు తనను నరికేస్తానని బెదిరించారని వాపోయాడు. వైసీపీ నేత, ఆయన అనుచరుల వల్లే తన ప్రాణాలకు ముప్పు ఉందని రాము నాయక్ అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు ఇప్పటికైనా రక్షణ కల్పించాలని పోలీసులను రాము నాయక్ వేడుకున్నాడు.

Updated Date - Feb 12 , 2024 | 09:11 PM