Share News

కౌంటింగ్‌ ఫియర్‌..!

ABN , Publish Date - May 31 , 2024 | 12:45 AM

కౌంటింగ్‌ రోజు దగ్గరపడే కొద్దీ టెన్షన పెరుగుతోంది. ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు, పార్టీలు, ఓటర్లది ఒక రకమైన టెన్షన కాగా.. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులది మరో రకం టెన్షన. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు హింసాత్మక మార్గాలను ఎంచుకోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. కౌంటింగ్‌ రోజున తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు...

కౌంటింగ్‌ ఫియర్‌..!
RVO examining Govt Degree College (File)

తాడిపత్రి ఆర్వో బదిలీ

అనారోగ్యం.. వైసీపీ ఒత్తిళ్లే కారణం

మరో రెండుచోట్ల ఇదే పరిస్థితులు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల చుట్టూ కుట్రలు

కలెక్టర్‌.. ఎస్పీకి సవాలుగా శాంతిభద్రతలు

తాడిపత్రి గొడవలతో పలువురి సస్పెన్షన

అనంతపురం టౌన, మే 30: కౌంటింగ్‌ రోజు దగ్గరపడే కొద్దీ టెన్షన పెరుగుతోంది. ఫలితాల కోసం ఎదురుచూసే అభ్యర్థులు, పార్టీలు, ఓటర్లది ఒక రకమైన టెన్షన కాగా.. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులది మరో రకం టెన్షన. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్నికల అధికారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులు హింసాత్మక మార్గాలను ఎంచుకోవడమే దీనికి కారణమని కొందరు అంటున్నారు. కౌంటింగ్‌ రోజున తమకు అనుకూలంగా వ్యవహరించాలని ఒత్తిడి చేస్తున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని ప్రచారం


జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది మొదలు ఈ ఒత్తిళ్లు మొదలయ్యాయని అంటున్నారు. ఓటరు జాబితాలో అక్రమాలు, పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు ఇందులో భాగమేనని స్పష్టమైంది. ఇవి చాలవన్నట్లు కౌంటింగ్‌ ప్రక్రియనూ సక్రమంగా జరిగేలా చూడకుండా అడ్డదారులు తొక్కుతున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారుపై కేంద్ర ఎన్నికల కమిషనకు ఫిర్యాదులు వెళ్లాయి. పలువురిపై ఈసీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో కలెక్టరు, డీఐజీ, ఎస్పీ బదిలీలు, ఎస్పీ డీఎస్పీ, సీఐ.. ఇలా కొందరి సస్పెన్షన్లు జరిగాయి. దీంతో కౌంటింగ్‌, ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.

తప్పుకున్న తాడిపత్రి ఆర్వో

తాడిపత్రి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాంభూపాల్‌రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న అభిప్రాయం ఉంది. చిన్నాచితికా ఒత్తిళ్లకు తలొగ్గే రకం కాదనికూడా అంటున్నారు. అయితే తాడిపత్రిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పోలింగ్‌ రోజున, ఆ తరువాత హింస చెలరేగి.. పోలీసు శాఖలో పలువురిపై వేటు పడింది. గొడవల్లో పాల్లొన్న పలువురిని అరెస్టు చేశారు. ఇరువర్గాలకు చెందిన 150 మందిపై రౌడీ షీట్లు తెరిచారు. టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థులను, ముఖ్య నాయకులను పట్టణానికి దూరంగా ఉంచారు. అడుగడుగునా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కౌంటింగ్‌ రోజు, ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బయట నెలకొన్న ఉత్కంఠ,


ఉద్రిక్త పరిస్థితులు అధికారులపై ప్రభావం చూపుతున్నాయి. పరిస్థితుల కారణంగా ఆర్వో రాంభూపాల్‌ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. మానసికంగానూ ఇబ్బంది పడుతున్నారు. పోలింగ్‌కు ముందు, ఆ తరువాత వైసీపీ స్థానిక నేతలు, రాష్ట్రస్థాయి నేతల నుంచి ఆయన అనేక రకాల ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొంటున్నారని బహిరంగ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన సెలవులో వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారులు అధికారులు నచ్చజెప్పడంతో మానుకున్నారు. కానీ పరిణామాలు మారుతుండటంతో ఆయనను బదిలీ చేశారు.

మరో ఇద్దరిదీ ఇదే పరిస్థితి?

అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మరో ఇద్దరు రిటర్నింగ్‌ అధికారులు కూడా తాడిపత్రి తరహా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం. ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికార పార్టీ ఆందోళన చెందుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారని, సాధ్యమైనన్ని పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను ఇనవ్యాలీడ్‌ చేయాలని ఆర్వోలపై అధికార పార్టీ ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపోటములను పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే నిర్ణయించే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఆ ఇద్దరు ఆర్వోలపై తీవ్రస్థాయి ఒత్తిళ్లు వస్తున్నాయని సమాచారం.

చెప్పినట్లు చేస్తారా..?

ఉద్యోగ సంఘాలు బలంగా ఉన్నాయని, జిల్లా ఎన్నికల అధికారి నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారని ఆర్వోలు చెప్పినా.. అధికార పార్టీవారు వినిపించుకోవడం లేదని సమాచారం. ఆ రెండు నియోజకవర్గాల అభ్యర్థులు, జిల్లాలో వ్యవహారాలను చక్కబెడుతున్న ఓ కీలక మంత్రి బెదిరింపులకు దిగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘ఇందుకేనా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది..? చెప్పినట్లు చేయకపోతే మీ ఇష్టం. ఏం జరుగుతుందో తెలుసు కదా..?’ అని బెదిరించారన్న చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరు ఆర్వోలు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సమయంలో సంతకాలు, సీల్‌ లేకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులతో ఓట్లు వేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన, జిల్లా ఎన్నికల అధికారికి పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ఆర్వోలపై వచ్చిన ఫిర్యాదుల గురించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినోద్‌ కుమార్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనకు నివేదించారని అధికారవర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో ఆ ఇద్దరు ఆర్వోలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదని సన్నిహితులు వద్ద వాపోతున్నట్లు తెలిసింది. కౌంటింగ్‌ రోజు దగ్గర పడేకొద్దీ వారిలో టెన్షన పెరుగుతోందని సమాచారం.

శాంతిభద్రతలే సమస్య..!

కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాకు ముగ్గురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను కౌంటింగ్‌ పరిశీలకులుగా నియమించింది. వారు జూన 2న జిల్లాకు వస్తున్నారు. కౌంటింగ్‌కు సమయం దగ్గరపడడంతో కలెక్టరు, ఎస్పీ రేయింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేయిస్తూనే.. శాంతిభద్రతల పరిరక్షణ దిశగా కఠిన చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఇరువర్గాలు కయ్యానికి దువ్వుతున్నాయి. అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లను నియమించుకోవడం, వారికి సూచనలు ఇవ్వడంలో నిమగ్నమయ్యాయి. ప్రతికూల ఫలితం వచ్చేలా ఉంటే రగడకు దిగేందుకూ వెనుకాడవద్దని అధికార పార్టీ నాయకులు ఏజెంట్లను ఎగేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని, మంచివారినే ఏజెంట్లుగా పంపించాలని వివిధ పార్టీల అభ్యర్థులకు జిల్లా అధికారులు సూచించారు. నాలుగో తేదీన ఏం జరుగుతుందోనని అన్ని వర్గాలు ఉత్కంఠను


ఎదుర్కొంటున్నాయి.

ఉండలేక.. ఉండలేక..

తాడిపత్రి టౌన: పోలింగ్‌ తరువాత ఆర్వో రాంభూపాల్‌ రెడ్డి విధుల్లో కొనసాగేందుకు ఏమాత్రం ఇష్టపడలేదు. సెలవుపై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి నుంచే రకరకాల ప్రచారం జరిగింది. పోలింగ్‌ రోజు, ఆ తరువాత తాడిపత్రిలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఎస్పీ అమిత బర్దర్‌ సహా పలువురు పోలీసు అధికారులు సస్పెండ్‌ అయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన మునుపెన్నడూ లేనంత కఠినంగా చర్యలు తీసుకుంది. దీంతో అధికారులకు కునుకు కరువైంది. వైసీపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్వో ఒత్తిడికి లోనయ్యారు. దీనికితోడు తాడిపత్రిలో రెవెన్యూ అధికారులు, ఎన్నికల సిబ్బంది కూడా ఆయనకు సహకరించడం లేదని సమాచారం. కడప జిల్లాకు చెందిన ఆయన.. నెలరోజులుగా తాను ఇంటిముఖం చూడలేదని, రోజూ అర్ధరాత్రి వరకూ ఎన్నికల విధుల్లో ఉండాల్సి వస్తోందని అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తనకు సహకరించేందుకు మరో అధికారిని (అసిస్టెంట్‌) నియమించాలని అడిగినా జిల్లా ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజులపాటు కలెక్టరేట్‌ చుట్టూ తిరిగారు. నాలుగు రోజులపాటు సెలవు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. కౌంటింగ్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఎందుకొచ్చిన సమస్య అని ఆయనను బదిలీ చేశారని అంటున్నారు.

బాధ్యతలు ఎవరికి..?

ఆర్వో రాంభూపాల్‌ రెడ్డి బదిలీ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో అత్యంత సమస్యాత్మక తాడిపత్రి నియోజకవర్గానికి కొత్త ఆర్వోగా ఎవరిని నియమిస్తారనే చర్చ జరుగుతోంది. మరో మూడు రోజుల్లో కౌంటింగ్‌ ఉంది. ఈ పరిస్థితులలో ఒత్తిళ్లను తట్టుకుని నిలబడే అధికారి కోసం అన్వేషిస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌, ఐఏఎస్‌ మేఘ స్వరూప్‌. ఉరవకొండ ఏఆర్వో, డిప్యూటీ కలెక్టరు శిరీష పేర్లు తెరపైకి వచ్చాయి. ఐఏఎస్‌ మేఘ స్వరూ్‌పనే తాడిపత్రి ఆర్వోగా నియమిస్తారని అంటున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 31 , 2024 | 12:45 AM