Share News

YCP Goons: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ గుండాలు వారే..

ABN , Publish Date - Feb 20 , 2024 | 02:08 PM

అనంతపురం: ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి దిగినవారు వైసీపీ గూండాలేనని తేలిపోయింది. దాడి జరిగి 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫోటోలను, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారమైన దృశ్యాలు చూసిన జనం నిందితులను గుర్తించగలుగుతున్నారు.

YCP Goons: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై దాడి చేసిన వైసీపీ గుండాలు వారే..

అనంతపురం: ఆంధ్రజ్యోతి (Andhrajyothy) అనంతపురం జిల్లా స్టాఫ్ ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణ (Photographer Srikrishna)పై దాడికి దిగినవారు వైసీపీ గూండాలేనని (YCP Goons) తేలిపోయింది. దాడి జరిగి 24 గంటలు దాటిపోయినా ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. కానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఫోటోలను, ఎలక్ట్రానిక్ మీడియా (Electronic Media)లో ప్రసారమైన దృశ్యాలు చూసిన జనం నిందితులను గుర్తించగలుగుతున్నారు. ఆంధ్రజ్యోతి పరిశీలనలో వారి నుంచి దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది.

దాడి చేసినవారిలో మంత్రి ఉషశ్రీచరణ్‌ (Ushasree Charan) అనుచరుడు గొల్ల అశోక్‌ (Golla Ashok), రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (Topudurthi Prakash Reddy) అనుచరుడు బండి రవి (Bandi Ravi), ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి (Ex MLA Visveshwara Reddy) అనుయాయి మిద్దె ఎర్రిస్వామి (Midde Erraswamy) ఉన్నట్టు చెబుతున్నారు. అశోక్‌ది కల్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట గ్రామం. తరచూ గొడవలు పడుతుంటాడు. వివాదాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటాడు. మంత్రి అండతో రెచ్చిపోతుంటాడని స్థానికులు చెబుతున్నారు. కర్ణాటకకు రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. కల్యాణదుర్గం టౌన్‌, కంబదూరు పోలీస్ స్టేషన్లలో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. 2021 క్రైం నంబర్‌ 127 కింద బియ్యం అక్రమ రవాణా కేసు నమోదైంది.

ఈ వార్త కూడా చదవండి.. సిగ్గు.. సిగ్గు!

బండి రవిది శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం కోనాపురం. రవి భార్య గ్రామంలో వలంటీరుగా పనిచేస్తున్నారు. చేనేత కార్మికుడిగా నకిలీ సర్టిఫికెట్‌ పొంది పింఛను తీసుకుంటున్నాడు. పెనుగొండలో ఓ మహిళా కానిస్టేబుల్‌ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు. అధికార పార్టీ అండతో గ్రామం రజకులకు దోబీఘాట్‌ కోసం ఏర్పాటుచేసిన బోరుబావి నీటిని దౌర్జన్యంగా తన పొలానికి మళ్లించుకున్నాడు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో బూత్‌లోకి దూరి టీడీపీ ఏజెంట్లపై దాడిచేశాడు. సిద్ధం సభలో శ్రీకృష్ణపై కట్టెతో రవి దాడిచేస్తున్న దృశ్యాలు వీడియోలో నమోదయ్యాయి. ఎర్రిస్వామిది అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల 2వ కాలనీ. ఇతను గతంలో యానిమేటర్‌గా పనిచేశాడు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన తనయుడు ప్రణయ్‌రెడ్డికి అనుచరుడిగా ముద్ర వేసుకున్నాడు. మూడేళ్ల క్రితం పీర్ల పండుగలో బీసీ సామాజికవర్గానికి చెందిన వారిపై దాడి చేశాడు. తిరిగి వారిపైనే కేసు పెట్టించాడు. కల్యాణదుర్గం నియోజకవర్గం బోయలపల్లికి చెందిన నాగేంద్ర, కిష్ట కూడా దాడిలో పాల్గొన్నారని స్థానికులు చెబుతున్నారు. వీరిద్దరూ కర్ణాటక మద్యాన్ని అక్రమంగా జిల్లాకు తెచ్చి విక్రయిస్తుంటారు.

దాడి చేసినవారు వైసీపీ ముఖ్యనేతలకు అనుచరులుగా ఉండడంతోనే పోలీసులు వారిని అరెస్టు చేయడంలేదు. ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణను లక్ష్యంగా చేసుకుని విచక్షణా రహితంగా, పాశవికంగా దాడికి పాల్పడినప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టి, రాతపూర్వకంగా ఫిర్యదు చేసినప్పటికీ ఇంతవరకు పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.

Updated Date - Feb 20 , 2024 | 02:08 PM