Share News

Attack by YCP mobs : సిగ్గు.. సిగ్గు!

ABN , Publish Date - Feb 20 , 2024 | 05:57 AM

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా? లేక నియంత పాలన సాగుతోందా? చివరకు ముఖ్యమంత్రి సభల్లో పాల్గొనే జర్నలిస్టులకు కూడా రక్షణ కరువైంది. వైసీపీ రౌడీమూకల దాడిని ప్రభుత్వం ఖండించాలి. తక్షణం నిందితులను అరెస్టు చేసేలా డీజీపీ చర్యలు తీసుకోవాలి’

Attack by YCP mobs : సిగ్గు.. సిగ్గు!

జర్నలిస్టులపై దాడులకేనా ‘సిద్ధం’?

‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌పై దాడి దుర్మార్గం

రాష్ట్రమంతా రగిలిన జర్నలిస్టులు

ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనల వెల్లువ

పాల్గొన్న టీడీపీ, జనసేన, లెఫ్ట్‌, ప్రజా సంఘాలు

(న్యూస్‌ నెట్‌వర్క్‌, ఆంధ్రజ్యోతి)

‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా? లేక నియంత పాలన సాగుతోందా? చివరకు ముఖ్యమంత్రి సభల్లో పాల్గొనే జర్నలిస్టులకు కూడా రక్షణ కరువైంది. వైసీపీ రౌడీమూకల దాడిని ప్రభుత్వం ఖండించాలి. తక్షణం నిందితులను అరెస్టు చేసేలా డీజీపీ చర్యలు తీసుకోవాలి’’ అంటూ జర్నలిస్టులు ముక్తకంఠం వినిపించారు. జర్నలిస్టులపై దాడులు చేయడానికేనా ‘సిద్ధం’ అంటున్నారని ఆగ్రహించారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రమంతా జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే నేతృత్వంలో విజయవాడలో పెద్దసంఖ్యలో పాత్రికేయులు రోడ్డెక్కారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం జగన్‌ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు దాడి చేసిన విషయం తెలిసిందే. ‘మీరు ఆంధ్రజ్యోతా’ అని అడుగుతూ, ఎంచుకొని మరీ శ్రీకృష్ణను వెంటబడి కర్రలతో కొట్టారు. ఈ దాడి జరిగి 24 గంటలు దాటిపోయినా, ఇంతవరకు నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదు. విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో దాడి దృశ్యాలను ప్రదర్శిస్తూ, వైసీపీ మూకల దాడులను నిరసిస్తూ జర్నలిస్టులు ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్‌, సీనియర్‌ నాయకులు ఎస్కే బాబు, మాట్లాడారు. ఛత్తీ్‌సగఢ్‌లో తెచ్చిన విధంగా జర్నలిస్టులపై దాడుల నివారణకు ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఏపీయూడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో జర్నలిస్టు నాయకులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టి, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నెల్లూరు రూరల్‌ మండలం జొన్నవాడ సర్కిల్‌ వద్ద వామపక్ష నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. శ్రీకృష్ణపై దాడి చేసిన వైసీపీ మూకలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఆర్డీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర తదితర నేతలు రాప్తాడు ఘటనను తీవ్రంగా ఖండించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద నల్లబ్యాడ్జీలను ధరించి జర్నలిస్టులు, ప్రజాసంఘాల ప్రతినిధులు నిరసన తెలిపారు.

ఆగ్రహించిన అనంత

శ్రీకృష్ణపై దాడి వైసీపీ గూండాల పాశవిక చర్య అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, వామపక్షాలు, రాజకీయ పార్టీలు ఆగ్రహించాయి. అనంతపురం నగరంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పయ్యావుల ప్రవీణ్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులు, ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తదితరులు ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ ఆధ్వర్యంలో అనంతపురం సిటీలోని అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర నుంచి ఎస్పీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు క్లాక్‌ టవర్‌ ఎదుట నిరసన తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గౌస్‌ మొయుద్దీన్‌ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. చిత్తూరులో కలెక్టరేట్‌ ఎదుట చిత్తూరు ప్రెస్‌క్లబ్‌, ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో పాత్రికేయులు....డీఆర్వో పుల్లయ్యకు వినతి పత్రాన్ని అందించారు. కుప్పంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పూతలపట్టులో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మురళీమోహన్‌ పాత్రికేయుల నిరసనలకు మద్దతు పలికారు.

హోరెత్తిన నిరసనలు...

ఏపీడబ్ల్యూజేఎఫ్‌ నాయకులు ప్రజా సంఘాలతో కలిసి నంద్యాల-చిత్తూరు రహదారిపై రాస్తారోకో చేపట్టి.. శ్రీకృష్ణపై దాడిని ఖండించారు. అనంతరం కలెక్టర్‌ కే.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తిరుపతిలో వివిధ జర్నలిస్టు సంఘాలు ప్రెస్‌ క్లబ్‌ నుంచీ ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ వద్ద గాంధీ విగ్రహం కూడలి వరకూ భారీ నిరసన ర్యాలీ చేపట్టాయి. సంఘీభావంగా టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం,కాంగ్రెస్‌ పార్టీల నేతలు పాల్గొన్నారు. మహాత్ముడి విగ్రహం వద్ద ప్లకార్డులు, బ్యానర్లతో గంట పాటు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

దాడి ఉన్మాద చర్య: సత్యకుమార్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ పై వైసీపీ మూకల దాడిని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం అత్యంత ఉన్మాద చర్య అని సోమవారం ట్వీట్‌ చేశారు. రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్‌ సభను కవర్‌ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమని, దీనిని ప్రతిఒక్కరూ ఖండించాలని సత్యకుమార్‌ పేర్కొన్నారు. సిద్ధం అంటే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికో, సంక్షేమానికో కాదని, వ్యవస్థలపై దాడులకు సిద్ధమని సీఎం జగన్‌ నిరూపించారని మండిపడ్డారు.

తక్షణం అరెస్టు చేయాలి

ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ జర్నలిస్టు సంఘాలు సోమవారం డిమాండ్‌ చేశాయి. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఏపీయూడబ్ల్యూజే, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో అనకాపల్లి నెహ్రూచౌక్‌ వద్ద జర్నలిస్టులు నిరసన తెలియజేశారు. ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ కృష్ణపై అమానుషంగా దాడి చేసిన వైసీపీ మూకలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం, కొవ్వూరు, నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి, అనపర్తి మండలాల్లో జర్నలిస్ట్‌లు నిరసన ప్రదర్శన చేశారు.

మేము సైతం

ఆంధ్రజ్యోతి స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై దాడిని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఏపీయూడబ్ల్యూజే కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జర్నలిస్టులు, ప్రజాసంఘాలు, టీడీపీ, వామపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్కింగ్‌ జర్నలిస్టులు, పలు రాజకీయ పార్టీల నాయకులు రోడ్డెక్కారు. కలెక్టర్‌ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయాలు, తాహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ.. వినతిపత్రాలు అందజేశారు. కడపలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి ఆఽధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, ఆర్‌సీపీ అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి, ఏపీడబ్ల్యుజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనాధరెడ్డి, చిన్నపత్రికల సంఘం అధ్యక్షుడు వెంకటరెడ్డి ఇతర మీడియా సిబ్బంది హాజరై సంఘీభావం తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కన్వీనర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గౌనిపల్లె శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు జగన్‌మోహన్‌రాజు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు చీర్ల శ్రీనివాసయాదవ్‌, భారత న్యాయవాదుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు టీ.ఈశ్వర్‌, జనసేన, ఎంఆర్‌పీఎస్‌, గిరిజన సమాఖ్య నేతలతోపాటు పెద్ద సంఖ్యలో ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి ‘స్పందన’ కార్యక్రమంలో ఉన్న కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Feb 20 , 2024 | 05:57 AM