Telangana: ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-07T18:23:41+05:30 IST

ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

Telangana: ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

హైద‌రాబాద్ : ఉపాధ్యాయుల బ‌దిలీల‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఇవాళ విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయుల బ‌దిలీల‌కు సంబంధించి పూర్వపు జిల్లాను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ‌స్థానం ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 317లో వేరే జిల్లాకు బ‌దిలీ అయిన ఉపాధ్యాయుల‌కు పూర్వ జిల్లా స‌ర్వీసును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఉపాధ్యాయ బ‌దిలీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కు అవ‌కాశం ఇవ్వనున్నట్లు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ప్రారంభ‌మైన ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప‌దోన్నతుల ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని, జీవో 317 కింద బదిలీ అయిన ఉపాధ్యాయులు తాజాగా ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 12 నుంచి 14వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించ‌నున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులంద‌రికి స‌మ‌న్యాయం చేకూర్చాల‌నే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే వ‌చ్చిన 59 వేల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్తి చేయ‌బ‌డుతుందని స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు.

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజి పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకచోట రెండేళ్లు పనిచేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఉమ్ముడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీసు పూర్తి లేదు. దీంతో తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాకు వచ్చామని, ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి అభ్యర్థనను పరిశీలించి, ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25 వేల మంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

Updated Date - 2023-02-07T18:29:54+05:30 IST