Share News

Revanth Reddy: తొలి అడుగులే వినూత్నం.. విభిన్నం.. ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి.. రజనీకి ఉద్యోగమిచ్చి..!

ABN , First Publish Date - 2023-12-07T14:54:15+05:30 IST

దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది.

Revanth Reddy: తొలి అడుగులే వినూత్నం.. విభిన్నం.. ప్రగతి భవన్ గేట్లు పగలగొట్టి.. రజనీకి ఉద్యోగమిచ్చి..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన ఎత్తయిన గ్రిల్స్‌ను, బారీకేడ్స్‌ను తొలగించేలా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్ ముందు రోడ్డు పక్కగా ఏర్పాటు చేసిన షెడ్‌ను కూడా తీసేయాలని సూచనలు చేశారు.

Pragathi-Bhavan.jpg

సామాన్య ప్రజలు కూడా ప్రగతి భవన్‌లోకి వచ్చేలా వీలు ఉండాలన్నది రేవంత్ ఉద్దేశం. ఏదో కష్టం చెప్పుకుందామని ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి మరీ ప్రగతి భవన్ దాకా వచ్చే ప్రజలను.. ఇలా బారీకేడ్స్, గ్రిల్స్ ఏర్పాటు చేసి అడ్డుకోవడం సమంజసం కాదన్నది రేవంత్ భావన. అందుకే.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రగతి భవన్‌కు వచ్చేలోపే ఆ గ్రిల్స్, బారీకేడ్స్ లాంటి వాటిని అధికారులు తీసేయిస్తున్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ను కలిసేందుకు ఈ గేట్ల వద్దే ప్రజలు పడిగాపులు కాసేవాళ్లనీ.. సీఎం అపాయింట్మెంట్ లేదంటూ ఎంతో మంది ఈ గేట్ల నుంచే తిరిగి వెనక్కు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ తీసుకున్న నిర్ణయంతో అలాంటి ఘటనలు మళ్లీ కనిపించబోవని తేల్చిచెబుతున్నారు.


‘ఈ ఎన్నికల్లో మన పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీకే మొట్టమొదటి ఉద్యోగం ఇస్తాం’ అంటూ రజనీ అనే మరుగుజ్జు యువతికి దాదాపు రెండు నెలల క్రితం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సభల్లో మాట్లాడారు. ఎంతో బిజీబిజీగా గడిపారు. పార్టీని గెలిపించేందుకు విశ్రాంతి లేకుండా పనిచేశారు. అయినప్పటికీ ఆనాడు ఆ యువతికి ఇచ్చిన హామీని రేవంత్ గుర్తుంచుకున్నారు.

R-1.jpg

‘నా వైకల్యమే నాకు శాపంగా మారింది. నాకున్న పరిమితుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదంటున్నారు. పోనీ ప్రైవేటు ఉద్యోగం చేద్దామన్నా నన్ను ఎవరూ జాబ్ లోకి తీసుకోవడం లేదు. ఎంతో కష్టపడి పీజీ చదివాను. మంచి మార్కులు సంపాదించాను. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంటే.. నేనే నా కుటుంబానికి భారంగా మారాను’ అంటూ రజనీ అనే మరుగుజ్జు యువతి ఆవేదనకు రేవంత్ మనసు కరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఉద్యోగం నీదేనంటూ రెండు నెలల క్రితమే రజనీకి ఆయన హామీ ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని మరీ రజనీని తన ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన ఉత్తర్వులపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి.. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఆమెకు ఉద్యోగం ఇవ్వడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాదు.. అశేష తెలంగాణ జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-12-07T14:54:16+05:30 IST