TS NEWS: హైదరాబాద్‌లో వరుస ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ 144 సెక్షన్ విధింపు..

ABN , First Publish Date - 2023-03-15T19:07:35+05:30 IST

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న వరుస ఆందోళనలతో పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు.

TS NEWS: హైదరాబాద్‌లో వరుస ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ 144 సెక్షన్ విధింపు..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో జరుగుతున్న వరుస ఆందోళనలతో పోలీసులు (Police) అప్రమత్తమయ్యారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పరిసర ప్రాంతాల్లో ఐదుగురికి మించి గుమిగూడవద్దని ఆదేశాలు ఇచ్చారు.

మరోవైపు.. టీఎస్‌పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం మరిన్ని కొత్త మలుపులు తిరుగుతోంది. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసిన టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్‌కుమార్‌ గ్రూప్‌-1 పరీక్ష రాయడం, ఇందులో అతనికి 103 మార్కులు రావడంతో ఈ పరీక్ష పేపర్‌ కూడా లీకైందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రవీణ్‌ ఉన్నతాధికారుల అనుమతి తీసుకొని పరీక్ష రాశాడు. ఈ పరీక్షలో మొత్తం 150 మార్కులకుగాను ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అతని బుక్‌లెట్‌ కోడ్‌ ఆధారంగా పోలీసులు కీ పేపర్‌ను పరిశీలించగా ఈ విషయం వెల్లడైనట్లు తేలింది. ఇన్ని మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అతడు డిస్‌క్వాలిఫై అయ్యాడు. ప్రాథమిక సమాచారం (బుక్‌లెట్‌ కోడ్‌, హాల్‌టికెట్‌ నంబర్‌) నింపే క్రమంలో బబ్లింగ్‌ సరిగా చేయకపోవడంతో అతని ఓఎంఆర్‌ షీట్‌ డిస్‌క్వాలిఫై అయినట్లు తేలింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు తదితర సమాచారం ప్రవీణ్‌ మొబైల్‌ ఫోన్‌లో దొరికినట్లు తెలిసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పేపర్‌ లీకైందన్న అనుమానాలకు ఇదే కారణమవుతోంది.

Updated Date - 2023-03-15T19:11:34+05:30 IST