TRS MLAs poaching case: హైకోర్టులో కీలక పరిణామం

ABN , First Publish Date - 2023-01-06T17:56:38+05:30 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు(TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది.

TRS MLAs poaching case: హైకోర్టులో కీలక పరిణామం
TRS MLAs poaching case

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర ఆరోపణల కేసు(TRS MLAs poaching case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వివరాలివ్వాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ(CBI) హైకోర్టుకు తెలిపింది. వివరాలు ఇస్తే తాము విచారణ చేస్తామని తెలిపింది. కేసు వివరాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సీబీఐ కోరింది. అయితే కేసు విచారణలో ఉందని, సీబీఐ వేచి ఉండాలని హై కోర్టు సూచించింది. సోమవారం సీబీఐ వాదనలు వింటామన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. కేసును దర్యాప్తు చేయాలని సీబీఐ డైరెక్టర్‌ను హైకోర్టు ఆదేశించడంతో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి సీబీఐ డైరెక్టర్ అప్పగించారు. దీంతో సీబీఐ ఢిల్లీ బృందం హైదరాబాద్ వచ్చింది. సిట్ నుంచి కేసు పత్రాలు ఇవ్వాలని సీఎస్‌కు సీబీఐ లేఖ రాసింది. సోమవారం వరకు కేసు ఫైళ్ళ కోసం ఒత్తిడి చేయవద్దని సీబీఐకి హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ అప్పీలుపై స్పష్టత వచ్చాక సీబీఐ సోమవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే యోచనలో ఉంది.

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ సందర్భంగా వాడివేడిగా వాదనలు కొనసాగాయి. బీజేపీ(BJP) ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ కూల్చలేదని న్యాయవాది దామోదర్ రెడ్డి తెలిపారు. ఏ ఎమ్మెల్యేనూ కొనులు చెయ్యలేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌(TRS) లో చేరాలని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది సీఎం కేసీఆరేనని లాయర్ దామోదర్ రెడ్డి తెలిపారు. 2014 నుండి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని దామోదర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.

అయితే బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య కోర్టులో వాదనలు ఎందుకని న్యాయస్థానం ప్రశ్నించింది. బీజేపీ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ డిస్మిస్ చేసినప్పుడు ఈ అప్పీల్‌లో మీ వాదనలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే తమ పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా సిట్ తరపు న్యాయవాది దవే వాదించారని, దానికి సమాధానం చెప్పడానికే రాజకీయాలు ప్రస్తావించానని బీజేపీ తరపు న్యాయవాది దామోదర్‌రెడ్డి చెప్పారు. తదుపరి విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది.

ఈ కేసులో ఇటీవలే హైకోర్టు ఆర్డర్‌ కాపీ బయటకు వచ్చింది. 26 కేసుల జడ్జిమెంట్లను కోట్‌ చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసు సీబీఐకి (CBI) ఇవ్వడానికి 45 అంశాలను హైకోర్టు ప్రస్తావించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చింది. సిట్‌ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ చేశారని హైకోర్టు మండిపడింది. కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్‌ విఫలమైందని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం కేసీఆర్‌కు చేరవేతపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్‌ దర్యాప్తు సక్రమంగా జరిగినట్లు అనిపించట్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. సిట్‌ చేసిన దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం ఎఫ్‌ఐఆర్‌ 455/2022ను సీబీఐకి బదిలీ చేసింది.

మరోవైపు ఈ కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh), తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్‌ను నిందితులుగా చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. గతంలో సిట్ మెమోను ఏసీబీ కోర్టు రిజక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. సిట్ రివిజన్ పిటిషన్‌ను కొట్టేయడంతో ఈ కేసులో కేసీఆర్ సర్కారుకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చినట్లైంది.

హైదరాబాద్ నగర శివార్లలోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో తమను ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు సంప్రదించారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), బీరం హర్షవర్ధన్‌రెడ్డి (కొల్లాపూర్‌), రేగా కాంతారావు (పినపాక) ఇటీవల ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే ఒక్కొక్కరికీ రూ.100 కోట్ల చొప్పున ఇస్తామని.. దాంతోపాటు కాంట్రాక్టులు కూడా ఇప్పిస్తామని ప్రలోభానికి గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీంతో ఈ కేసులో రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, మరొకరు తిరుపతికి చెందిన సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CV Anand) అధ్యక్షతన సిట్‌ను ఏర్పాటు చేశారు. ఆరుగురు పోలీస్ ఉన్నతాధికారులతో ఆరుగురు సభ్యులుగా సిట్ ఏర్పాటైంది. నల్గొండ ఎస్పీ రాజేశ్వరి, సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కల్మేశ్వర్‌, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్‌, శంషాబాద్‌ డీసీపీ జగదేశ్వర్‌రెడ్డి, మొయినాబాద్‌ సీఐ లక్ష్మిరెడ్డిలను సిట్‌ సభ్యులుగా ఎంపిక చేశారు.

Updated Date - 2023-01-06T18:30:30+05:30 IST