Congress: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యూటర్న్.. రగిలిపోతున్న కాంగ్రెస్‌ సీనియర్ నేతలు

ABN , First Publish Date - 2023-02-14T18:24:49+05:30 IST

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేగుతోంది.

Congress: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి యూటర్న్.. రగిలిపోతున్న కాంగ్రెస్‌ సీనియర్ నేతలు

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తులపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. పార్టీకి నష్టం కలిగించేలా కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ సీనియర్‌ నేతలు హైకమాండ్‌కు ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు కలువక తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అలాంటి మాటలు పార్టీకి నష్టమని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు థాక్రే ఆరా తీస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాదని కాంగ్రెస్ (Congress) ఎంపీ కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat Reddy) జోస్యం చెప్పారు. ఢిల్లీలో కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో హంగ్ ఏర్పడుతోందని ఎంపీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి 60 సీట్ల కన్నా ఎక్కువ గెలవలేరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కలవక తప్పదని కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మార్చి మొదటి వారం నుంచి తన పాదయాత్ర ప్రారంభం అవుతుందని వెంకట్ రెడ్డి అన్నారు.

గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని, ఒంటరిగానే పోరుడుతామని.. ఎన్నికల తర్వాత పొత్తులు తప్పవని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మాణిక్యం ఠాగూర్ ఫోన్లు చూసుకునేవారు తప్ప ఏమీ పట్టించుకునేవారు కాదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో పాతవాళ్లు 20 శాతం మంది కూడా లేరు. కాంగ్రెస్‌ 40 నుంచి 50 స్థానాల మధ్య గెలుస్తుందని ఎంపీ చెప్పారు. ఏమైనా మిరాకిల్ జరిగితే తప్ప కాంగ్రెస్‌కు మెజార్టీ రాదని, ఎవరో ఒకరు తాను గెలిపిస్తానంటే కుదరదని స్పష్టం చేశారు. ఆయనే గెలిపిస్తారని మిగతావాళ్లు ఊరుకుంటారని, తాను గెలిపిస్తా అనే వ్యక్తి ఎవరో అందరికి తెలుసు వెంకట్ రెడ్డి అన్నారు. పేరు తాను చెప్పాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి గురించి వెంకటరెడ్డి ప్రస్తావించారు.

తాను స్టార్ క్యాంపైనర్‌నని రాష్ట్రమంతా తిరుగుతానని చెప్పారు. యాదగిరి గుట్ట (Yadagiri Gutta) నుంచి యాత్ర మొదలు పెడతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ మానిక్ థాక్రే (Manik Thackeray) వచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి బాగుందని, పార్టీ గాడిలో పడిందన్నారు. గత ఇంఛార్జ్ అంతా ఫోన్‌లోనే చూసుకునేవారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.

అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఏం చేసిందో మేము చెప్పామని, దేశానికి చాలా చేసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంచి పార్టీ అని, తెలంగాణ ఇచ్చిందని.. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు కొన్నారని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ సెక్యులర్ పార్టీలని, తాము బీజేపీతో కలిసేదిలేదని స్పష్టం చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏం మాట్లాడారో తాను చూడలేదని అన్నారు. ఆయనపై పార్టీ నేతలు ఏం మాట్లాడారనే విషయం కూడా తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీకి నష్టం కలిగించే విధంగా చర్యలు, మాటలను పార్టీ అధినాయకత్వం నిశితంగా గమనిస్తుందని అన్నారు. ఈ విషయాలన్నింటిపైనా అధిష్టానం పరిధిలోనే నిర్ణయాలు ఉంటాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫ్రస్తుతం తన దృష్టి అంతా పాదయాత్రలో ప్రజలు తనకు వివరించే సమస్యల మీదే ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-02-14T19:50:41+05:30 IST