KTR: ఎన్టీఆర్‌ చేయలేనిది.. శిష్యుడిగా కేసీఆర్ చేసి చూపిస్తారు

ABN , First Publish Date - 2023-09-30T13:39:34+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్నిఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తమకు తేలీదని.. తమకు రాముడైనా.. కృష్ణుడైనా అన్న ఎన్టీఆరే అని తెలిపారు.

KTR: ఎన్టీఆర్‌ చేయలేనిది.. శిష్యుడిగా కేసీఆర్ చేసి చూపిస్తారు

ఖమ్మం: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు (NTR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో తమకు తేలీదని.. తమకు రాముడైనా.. కృష్ణుడైనా అన్న ఎన్టీఆరే అని తెలిపారు. భారతదేశంలో తెలుగువారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని కొనియాడారు. చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అని.. అందులో ఎన్టీఆర్ స్థానం పదిలం అని చెప్పుకొచ్చారు. తారక రామారావు పేరులోనే పవర్‌ ఉందన్నారు. ఎన్నో పదవులకు వన్నె తెచ్చిన మహానేత ఎన్టీఆర్‌ అని అన్నారు. మహానేత ఎన్టీఆర్ ఎన్నో సాధించారని.. కానీ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కాలేకపోయారన్నారు. ఎన్టీఆర్ శిష్యుడు కేసీఆర్‌కు (CM KCR) ఆ సత్తా ఉందన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


కాంగ్రెస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి.. కానీ...

కేటీఆర్ ఇంకా మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై (Congress) విరుచుకుపడ్డారు. హామీల్లో ఏ ఒక్కటైనా కాంగ్రెస్‌ నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ఆరు దశాబ్దాలు ఏమీ చేయలేని అసమర్థులు.. నేడు గ్యారంటీల పేరుతో ప్రజల ముందుకొస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి వారంటీ లేదని వ్యాఖ్యలు చేశారు. వారంటీ లేని కాంగ్రెస్‌ పార్టీ నేతలు గ్యారంటీ ఇస్తారట అంటూ సెటైర్ విసిరారు. కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఖమ్మం అన్ని రంగాలలో అభివృద్ది చెందిందన్నారు. ఈ అభివృద్ది పథంలో పరుగులు పెడుతున్న ఖమ్మంను చూస్తే సంతోషంగా ఉందన్నారు. ఖమ్మంలో నేడు రూ.1300 కోట్ల అభివృద్ది పనులు ప్రారంభించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ఆరిపోయిన దీపం అని.. చచ్చిన శవం అని...వారంటీ లేని పార్టీ నేతలు గ్యారంటీ ఇస్తామని తెలంగాణ ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. ‘‘ఆలోచించండి ఆగం కాకండి.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అమ్ముడు పోయే అంగడి సరుకు కాదు అని నిరూపించండి. కర్నాటకలో దోచుకున్న దొంగ సొమ్ముతో మీ ముందుకు వస్తున్నారు. ఆ డబ్బు తీసుకోండి.... ఓటు కారు గుర్తుకు వేయండి’’ అని ప్రజలకు మంత్రి కేటీఆర్ కోరారు.

Updated Date - 2023-09-30T15:18:55+05:30 IST