Revanth Reddy: సహాయక చర్యల్లో పాల్గొనండి.. నేతలకు రేవంత్ పిలుపు
ABN , First Publish Date - 2023-07-21T09:46:00+05:30 IST
వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
హైదరాబాద్: వరదల సమయంలో కాంగ్రెస్ నేతలు సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) పిలుపునిచ్చారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఇళ్లలోకి నీరు చేరి, వరదలతో ముంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు వెంటవెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.