GovernorVsGovt: తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు ఇవ్వబోయి ఆగిన సుప్రీంకోర్ట్.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-03-20T17:23:13+05:30 IST

తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్దపడడంతో... గవర్నర్‌కు నోటీసులు ఇవ్వవద్దని...

GovernorVsGovt: తెలంగాణ గవర్నర్‌కి నోటీసులు ఇవ్వబోయి ఆగిన సుప్రీంకోర్ట్.. ఎందుకంటే..

ఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) బిల్లులను ఆమోదించడంలేదంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారం విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి గవర్నర్‌కు నోటీసులు జారీ చేసేందుకు సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం తొలుత సిద్దపడింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందనను కూడా తెలుసుకోవాలని భావించింది. అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor general Tushar Mehta) విజ్ఞప్తి చేయడంతో కోర్ట్ వెనక్కి తగ్గింది.

గవర్నర్‌, కేంద్రానికి నోటీసులు ఇస్తే అది తప్పుడు సంప్రదాయానికి దారి తీస్తుందని తుషార్ మెహతా పేర్కొన్నారు. గవర్నర్ పదవి రాజ్యాంగబద్ధమైనదని, అటువంటి వారికి నోటీసులు ఇవ్వడం సరికాదని ఆయన సూచించారు. తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న బిల్లులలో కొన్నింటిని కొద్ది రోజుల క్రితమే పంపారని... అసలు విషయం ఏమిటో తెలుసుకొని కోర్టుకు నివేదిస్తానని చెబుతాన్నారు. దీంతో సోమవారం కల్లా కోర్టుకు వివరాలు చెప్పాలని సీజేఐ చంద్రచూడ్ సూచించారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. కాగా ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ సర్కారు పిటిషన్‌లో కోరిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-03-20T17:58:15+05:30 IST