Share News

HarishRao: వైఎస్సార్టీపీ విలీనం చేసేందుకు వచ్చిన నాయకులకు స్వాగతం

ABN , First Publish Date - 2023-11-13T15:34:39+05:30 IST

ఎస్సార్టీపీ నుంచి పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సోమవారం మంత్రి హరీష్‌రావు సమక్షంలో గట్టు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబా పార్టీ కండువా కప్పుకున్నారు.

HarishRao: వైఎస్సార్టీపీ విలీనం చేసేందుకు వచ్చిన నాయకులకు స్వాగతం

హైదరాబాద్: వైఎస్సార్టీపీ (YSRTP) నుంచి పలువురు నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో(BRS) చేరారు. సోమవారం మంత్రి హరీష్‌రావు సమక్షంలో గట్టు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, అన్ని జిల్లా కోఆర్డినేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గులాబా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. వైఎస్సార్టీపీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయడానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు స్వాగతం తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ వాళ్లు పార్టీ పెట్టగలుగుతారా, పార్టీ నడపగలుగుతారా అని అవహేళన చేశారన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 14 సంవత్సరాలు పార్టీని నిలబెట్టి, రాష్ట్ర సాధన కోసం చావు అంచుల వరకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు ఒకే ఒక్కడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్య నాయకులు పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టడం కాదు అని అవహేళన చేశారని గుర్తుచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) తెలంగాణ వస్తే చీకటిమయం అవుతుందని అన్నారన్నారు. తెలంగాణ పథకాలను దేశమే ఆదర్శంగా తీసుకుని అమలు చేసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. తండ్రి సమానులైన కేసీఆర్‌ను రాజకీయం కోసం నానా మాటలు తిట్టి ఈరోజు రాజకీయాల కోసం పార్టీని గాలికి వదిలేసిన నాయకురాలు షర్మిల (YSRTP Chief YS Sharmila) అంటూ మంత్రి విరుచుకుపడ్డారు.


కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామని చెప్తున్న కర్ణాటక మోడల్ ప్రజలకు అర్థమైందన్నారు. కర్ణాటకలో రైతులు రోడ్డు మీదకు వచ్చారని.. కర్ణాటకలో మూడు గంటల కరెంటు ఇచ్చి కాంగ్రెస్ రైతుల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ మోడల్ తెలంగాణలో పనికిరాదని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తోక ముడ్చుకుందని వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇస్తున్న రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా అవహేళన చేసేలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని కూడా అవహేళన చేసే విధంగా రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కించపరచేలా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. సీమాంధ్ర నాయకుల సూట్ కేసులు మోయడానికి అలవాటు పడ్డ వెన్నెముక లేని నాయకులు తెలంగాణని సమైక్య పాలకుల పాదాల దగ్గర పెట్టుతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి 50పైన స్థానాల్లో అభ్యర్థులు లేని పరిస్థితి అని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని.. హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం గురించి తెలవని రేవంత్ రెడ్డికి రైతులు ఎన్ని గంటలు పవర్ మోటర్ ఉపయోగిస్తారో కూడా తెలియదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వైఎస్ఆర్‌టీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరుకుంటున్నానన్నారు. వైఎస్ఆర్టీపీలో ఎదుర్కొన్న సూటిపోటి మాటలు అవహేళనలు బీఆర్ఎస్ పార్టీలో ఉండవని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-11-13T15:34:41+05:30 IST