Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

ABN , First Publish Date - 2023-07-22T16:51:08+05:30 IST

తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.

Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును (Special trains extended) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్‌ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో హైదరాబాద్‌- కటక్‌, తిరుపతి-జల్నా, జల్నా- చాప్రా, హైదరాబాద్‌- గోరక్‌పూర్‌ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి అక్టోబర్‌ 1 తేదీల మధ్య నిర్దేశించిన తేదీల్లో ఆయా రైళ్లు (Special Trains) నడవనున్నాయి.

పొడిగించిన ప్రత్యేక రైళ్లు ఇవే..

  • హైదరాబాద్-కటక్-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు

  • కటక్-హైదరాబాద్-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు

  • తిరుపతి-జల్నా-ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 26 వరకు

  • జల్నా-తిరుపతి-ఆగస్టు 6 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు

  • జల్నా-చాప్రా-ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 27 వరకు

  • చాప్రా-జల్నా-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు

  • హైదరాబాద్-గోరఖ్ పూర్-ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 29 వరకు

  • గోరఖ్ పూర్-హైదరాబాద్-ఆగస్టు 6వ తేదీ నుంచి అక్టోబర్ 1, 2023 వరకు

రూ.20, రూ.50 ధరలకే భోజనం..

  • ప్రయోగాత్మకంగా 4 స్టేషన్లలో అమలు

ఇదిలా ఉంటే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్‌, విజయవాడ, గుంతకల్‌, రేణిగుంట రైల్వే స్టేషన్లలో జనరల్‌ బోగీలో ప్రయాణించే వారి కోసం తక్కువ ధరకే నాణ్యమైన భోజనం, మంచినీటిని అందించేందుకు భారతీయ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ‘ఎకానమీ మీల్స్‌’ కార్యక్రమంలో భాగంగా.. మొదటి రకం ఎకానమీ భోజనం రూ.20కు, రెండో రకం కాంబో భోజనం రూ.50కు అందిచనుంది. ఎకానమీ భోజనంలో 7 పూరీలు, ఆలు కూర, పచ్చడిని అందిస్తారు. కాంబో భోజనంలో అన్నం, కిచిడీ, ఛోలే కుల్చే, ఛోలే భటూరే, పావ్‌భాజీ, మసాలా దోశలను అందించనున్నారు. భోజనంతో పాటు 200 ఎంఎల్‌ ప్యాకేజ్‌డ్‌ మంచినీటి వాటర్‌ గ్లాసులను కూడా ఇస్తారు. ఆయా రైల్వే స్టేషన్లలో ఉన్న ఐఆర్‌సీటీసీ కిచెన్‌ యూనిట్లు-జన్‌ ఆహార్‌ సర్వీస్‌ కౌంటర్ల ద్వారా భోజనాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనరల్‌ కోచ్‌ల సమీపంలోని ప్లాట్‌ఫాంపై ఫుడ్‌ సర్వీస్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఎకానమీ మీల్‌ సేవలను వినియోగించుకునేందుకు అవకాశం లభిస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ తెలిపారు. 6 నెలల పాటు నాలుగు రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తామని.. అనంతరం ఇతర స్టేషన్లకు విస్తారిస్తామని వెల్లడించారు.

Updated Date - 2023-07-22T17:29:25+05:30 IST