Hyderabad: పెళ్లయి పట్టుమని ఏడాది.. ఏం పాపం చేశారని ఈ జంటకు ఇంత పెద్ద శిక్ష..!

ABN , First Publish Date - 2023-05-25T17:12:08+05:30 IST

హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి, సంవత్సరం క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. అయితే..

Hyderabad: పెళ్లయి పట్టుమని ఏడాది.. ఏం పాపం చేశారని ఈ జంటకు ఇంత పెద్ద శిక్ష..!
Couple Death

ఈ లోకంలో భార్యాభర్తల బంధానికి మించిన బంధం మరొకటి లేదు. ఈ బంధం విడదీయరానిది. అందుకే మూడు పేటల తాడు త్వరగా తెగిపోదంటారు. మూడు ముళ్లతో జతపరచబడిన ఆ జంట కూడా అంతగా ముడిపడి పోయారు. ఇంతలోనే విధి వెక్కిరించింది. చూడముచ్చటగా ఉన్న ఆ జంటను చూసి విధికి కన్నుకుట్టినట్లుంది. అనుకోని రీతిలో భర్త ప్రాణాలు కోల్పోతే.. భర్త లేని జీవితాన్ని అతని భార్య ఊహించుకోలేకపోయింది. ఆ బాధ నుంచీ తేరుకోక ముందే ఆమె కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్‌పేటలోని డీడీ కాలనీకి చెందిన సాహితి(29)కి, సంవత్సరం క్రితం వనస్థలిపురానికి చెందిన మనోజ్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో వివాహం జరిగింది. అనంతరం వారిద్దరూ అమెరికాలోని డల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఈనెల 2వ తారీఖున తల్లిదండ్రుల్ని చూసేందుకు సాహితి హైదరాబాద్‌కు వచ్చింది. రోజూ భార్యాభర్తలిద్దరూ ఫోన్‌లో ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ సంతోషంగా సాగిపోతున్నారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఈ నెల 20న హఠాత్తుగా మనోజ్‌కు హార్ట్‌స్ట్రోక్‌ రావడంతో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సాహితి, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అమెరికా నుంచి ఈనెల 23న మనోజ్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంది. మే 24న (బుధవారం) అశ్రునయనాల మధ్య వనస్థలిపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. వచ్చిన బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

అనంతరం సాహితి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తల్లిదండ్రులతో కలిసి అంబర్‌పేటలోని డీడీ కాలనీ చేరుకుంది. గత రాత్రి సాహితి, ఆమె చెల్లెలు సంజనా కలిసి ఒకే రూమ్‌లో పడుకున్నారు. ఇవాళ ఉదయం (గురువారం) 9:20 నిమిషాలకు సంజనా వాష్‌రూమ్‌కు వెళ్లి 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసింది. ఇంతలోనే లోపల గడియ పెట్టి ఉంది. దీంతో ఆందోళన చెందిన ఆమె ఎంత పిలిచినా అక్క సాహితి పలకలేదు. దీంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే సాహితి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ldld.jpgdldll.jpg

Updated Date - 2023-05-25T17:16:13+05:30 IST