CBI: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌‌పై రఘురామ చెప్పిన మాట నెరవేరుతుందా?

ABN , First Publish Date - 2023-03-09T18:59:04+05:30 IST

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) పిటిషన్‌పై ఎంపీ రఘు రామ కృష్ణమ రాజు (MP Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు.

CBI: అవినాశ్‌రెడ్డి పిటిషన్‌‌పై రఘురామ చెప్పిన మాట నెరవేరుతుందా?

ఢిల్లీ: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) పిటిషన్‌పై ఎంపీ రఘు రామ కృష్ణమ రాజు (MP Raghu Rama Krishna Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో అవినాశ్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేయడం ఖాయమని ఎంపీ రఘురామ అన్నారు. వివేకా హత్య కేసులో అవినాశ్ పలాయనవాదం చిత్తగించడంలో ఆంతర్యం ఏమిటని రఘురామ ప్రశ్నించారు. అలాగే సీబీఐ (CBI) అరెస్ట్ చేస్తుందని అవినాశ్ ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానన్న అవినాశ్ ఇప్పుడు కుంటిసాకులు ఎందుకు వెతుక్కుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఇదిలావుండగా... మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే రెండు దఫాలు విచారించింది. మరో విడత విచారణకు ఈ నెల 6న రావాలంటూ నోటీసులు పంపగా, తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని అవినాశ్ రెడ్డి బదులిచ్చారు. దాంతో సీబీఐ ఈ నెల 10న రావాలంటూ మళ్లీ నోటీసులు పంపింది. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి రేపు హైదరాబాదులో సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ విషయంలో అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన విచారణకు న్యాయవాదిని కూడా అనుమతించాలని... విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్ చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు, తీవ్రమైన చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలం కాపీని ఇచ్చేలా ఆదేశించాలని కూడా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-09T19:45:49+05:30 IST