Hyderabad: బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర హైడ్రామా.. 46 మంది బీజేపీ కార్పొరేటర్ల నిరసన

ABN , First Publish Date - 2023-05-03T18:49:38+05:30 IST

బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది.

Hyderabad: బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర హైడ్రామా.. 46 మంది బీజేపీ కార్పొరేటర్ల నిరసన

హైదరాబాద్: బల్దియా ప్రధాన కార్యాలయం దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. కౌన్సిల్ హాల్లో 46 మంది బీజేపీ కార్పొరేటర్లు (BJP corporators) నిరసనకు దిగారు. జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు హాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు చీకట్లోనే నిరసనకు దిగారు. కౌన్సిల్ భేటీలో సమస్యలపై చర్చించకుండానే వాయిదా వేయడం పట్ల కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి భారీగా బీజేపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్తున్న బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. దోమ వేషధారణలో ఉన్న మల్కాజ్ గిరి కార్పొరేటర్‌తో పాటు లైఫ్ జాకెట్లు వేసుకున్న కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. లైఫ్ జాకెట్లు తొలగించి కౌన్సిల్ హాల్ లోపలికి వెళ్లాలంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజెపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చిన్న వర్షానికే అతలాకుతలమవుతున్న హైదరాబాద్ నగర ప్రజల ప్రాణాలకి రక్షణ లేదని, అందుకే జీహెచ్ఎంసీ కౌన్సిల్‌కి వెళ్తూ ఉండగా తన కుటుంబ సభ్యులు తన భద్రత గురించి లైఫ్ జాకెట్, స్విమ్మింగ్ ట్యూబ్ తదితర వస్తువులు ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి తిరిగి రమ్మని పంపించారని సరూర్‌నగర్‌ కార్పోరేటర్ ఆకుల శ్రీవాణి మీడియాకు తెలిపారు.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇకనైనా తమ మొద్దు నిద్ర వదిలి హైదరాబాదులోని పెండింగ్ నాలా పనులు.. డ్రైనేజీ వ్యవస్థ తక్షణమే సరిదిద్ది ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే రానున్న రోజులలో తమరే ప్రతి ఇంటికి ఇవి ఇవ్వాల్సి వస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఆదాయం ప్రతి సంవత్సరం పెరుగుతుందని, కానీ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయని, కోట్ల రూపాయల ప్రజాధనం ఎక్కడికి పోతుంది? అని ఆకుల శ్రీవాణి ప్రశ్నించారు.

Updated Date - 2023-05-03T18:49:38+05:30 IST