TS Election: 5 గంటల తర్వాత క్యూలో నిలబడితే మాత్రం..!
ABN , First Publish Date - 2023-11-29T17:14:11+05:30 IST
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి
![TS Election: 5 గంటల తర్వాత క్యూలో నిలబడితే మాత్రం..!](https://media.andhrajyothy.com/media/2023/20231102/votes_5_pm_e3ea7b2114.jpg)
హైదరాబాద్: తెలంగాణలో పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 30-11-2023న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే ఓటింగ్ ముగియనుంది. అయితే ఓటర్లు కొన్నిసార్లు తికమకపడుతుంటారు. ఇంకొందరైతే ప్రయాణాల వల్ల ఇబ్బందిపడుతుంటారు.. లేదంటే వయసు రీత్యా సమయానికి రాకపోవడం వంటివి జరుగుతుంటాయి. ఆయా కారణాల చేత సమయానికి పోలింగ్ బూత్కు రాకపోతే ఓటర్లకు అధికారులు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా? ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారా? లేదా? తెలియాలంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే.
5 గంటల తర్వాత ఓటు వేయొచ్చా!?
ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత వచ్చే ఓటర్లను అధికారులు లోపలికి అనుమతించరు. ఒకవేళ వేసినా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోరు. కానీ సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ కేంద్రం దగ్గర క్యూలో నిలబడితే మాత్రం ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. కనుక ఎన్నికల నియామవళి ప్రకారం సాయంత్రం 5 గంటలలోపే పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే మంచిది. లేదంటే ఓటు హక్కును కోల్పోతారు.