Share News

Revanth Reddy: మీ పతనం మొదలైంది... మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది..

ABN , First Publish Date - 2023-11-24T12:30:34+05:30 IST

Telangana Elections: తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బీజేపీ - బీఆర్ఎస్ కుమ్మక్కై కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని తెలిపారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ, కేసీఆర్ రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శించారు.

Revanth Reddy: మీ పతనం మొదలైంది... మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది..

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. బీజేపీ (BJP) - బీఆర్ఎస్ (BRS) కుమ్మక్కై కాంగ్రెస్ నేతల (Congress Leaders) ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయని తెలిపారు. అత్యున్నత ప్రభుత్వ సంస్థలు, రాజ్యాంగ బద్ధ వ్యవస్థలను కూడా మోడీ (PM Modi), కేసీఆర్ (CM KCR) రాజకీయ క్రీడలో పావులుగా మార్చేశారని విమర్శించారు. ఆ రెండు పార్టీలలో చేరిన వాళ్లు పవిత్రులు... ప్రతిపక్షంలో ప్రజల తరఫున కొట్లాడే వాళ్లు ద్రోహులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదని... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది బీజేపీ - బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ అని అన్నారు. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయని నిలదీశారు. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి అని అన్ారు. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుంచి అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన పదేళ్లలో మోడీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కుమన్నది లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ తెలిపారు.


కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయన్నారు. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం.. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది అంటూ మండిపడ్డారు. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే... వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోందన్నారు. కేసీఆర్‌‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవన్నారు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్‌ను ప్రశ్నించవని.. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా అంటూ విరుచుకుపడ్డారు. పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై కూడా ఉందన్నారు. ‘‘నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వివేక్ వెంకట స్వామి కుటుంబంపై దాడి కాంగ్రెస్ పార్టీపై జరిగిన దాడిగా భావిస్తాం. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు’’ అని స్పష్టం చేస్తూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T12:34:10+05:30 IST