Share News

Revanth Reddy: మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం.. పార్టీలకు రేవంత్ వినతి

ABN , First Publish Date - 2023-11-03T12:57:59+05:30 IST

తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్ఎస్ పార్టీతో సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు.

Revanth Reddy: మందు, డబ్బు లేకుండా ఎన్నికల్లోకి వెళదాం.. పార్టీలకు రేవంత్ వినతి

హైదరాబాద్: తెలంగాణ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) చుక్క మందు, డబ్బు లేకుండా వెళదామని అధికార బీఆర్ఎస్ పార్టీతో (BRS Party) సహా ఇతర పార్టీలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కోరారు. విధివిధానాలపై ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళదామని తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పిల్లర్లు కుంగాయి కాబట్టే మేడిగడ్డ బ్యారేజీ జాయింట్‌లో గ్యాప్ పెరిగిందన్నారు. ఒక మీటరు కుంగిందని అధికారులే చెబుతున్నారని.. తప్పించుకోవడానికే కేటీఆర్ ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము తప్పు చెబుతున్నామంటే.. అఖిలపక్షాన్ని తీసుకెళదామని.. ప్రాజెక్టు కుంగిందో లేదో వాళ్లే చెబుతారని అన్నారు. బీఆర్‌ఎస్ నేతలవి లాజిక్ లేని వాదనలని విమర్శించారు.


సంక్షేమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ (Congress Party) అని స్పష్టం చేశారు. పెన్షన్లు, పక్కా ఇళ్లు లాంటి పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ (CM KCR) తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు. మైనారిటీలను అన్ని రకాలుగా సంక్షేమంలో భాగస్వాములను చేస్తామని చెప్పుకొచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పేదలకు విద్యను చేరువ చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన స్కూళ్లలో 6,540 సింగిల్ టీచర్ స్కూళ్లను కేసీఆర్ హయాంలో మూసేశారన్నారు. రైతులకు ఎకరానికి ఏటా 10 వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని.. దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని అన్నారు. తన లోపాలను కప్పిపుచ్చుకునేందుకే పక్క రాష్ట్రాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు.


దశాబ్ద పాలనపై చర్చకు సై..

కాంగ్రెస్ దశాబ్ద పాలన - బీఆర్‌ఎస్ దశాబ్ద పాలనపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ‘‘మా పార్టీ నుంచి నేను, సీఎల్పీ భట్టి వస్తాం... మిగతా పార్టీల నుంచి ఇద్దరు చొప్పున రండి. చర్చ పెడితే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు బయట పడతాయి. ఓటుకు వెల కట్టే సంస్కృతి తెచ్చిందే కేసీఆర్. హైదరాబాద్‌లో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్. హైదరాబాద్‌ను పెట్టుబడి నగరంగా తీర్చిదిద్దుతాం. గంగా నదిలా మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీ రివర్ ఫ్రంట్‌ను అద్భుతంగా అభివృద్ధి చేసే ప్రణాళిక మా దగ్గర ఉంది. అర్బన్, రూరల్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ ఇవ్వనున్నాం. రాచకొండ గుట్టలను తెలంగాణ ఊటీలా అభివృద్ధి చేస్తాం. హైదరాబాద్‌ను ప్రపంచానికే తలమానికంగా మారుస్తాం’’ అని టీపీసీసీ చీఫ్ వెల్లడించారు.


పొత్తుల అంశం ముగియలేదు...

కమ్యూనిస్టులతో పొత్తుల అంశం ఇంకా ముగియలేదని రేవంత్ అన్నారు. పొత్తు అంశంపై తమ సమన్వయ కమిటీ చర్చలు జరుపుతోందన్నారు. ధరణి పోర్టల్ పేరుతో ప్రభుత్వమే పెద్ద దళారీగా మారిందని ఆరోపించారు. ధరణిలో అత్యంత పెద్ద దళారులు కేసీఆర్ కుటుంబసభ్యులే అని.. తాము ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్‌కు ఎందుకంత దుఃఖం అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-11-03T12:58:00+05:30 IST