WhatsApp banned: 65 లక్షల మంది భారతీయులకు షాకిచ్చిన వాట్సాప్!..
ABN , First Publish Date - 2023-07-03T16:48:19+05:30 IST
భారతదేశంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నవారికి వాట్సాప్ (WhatsApp) బిగ్ షాక్ ఇచ్చింది. ఒక్క మే నెలలోనే ఏకంగా 65 లక్షల మంది వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది.
భారతదేశంలో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నవారికి వాట్సాప్ (WhatsApp) బిగ్ షాక్ ఇచ్చింది. ఒక్క మే నెలలోనే ఏకంగా 65 లక్షల మంది వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. 2021లో కొత్తగా తీసుకొచ్చిన ఐటీ చట్టం 4(1)(డీ), 3ఏ(7) కింద ఈ నిషేధాన్ని అమలు చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. వాట్సాప్ మోసాలపై ఒక్క మే నెలలోనే 3,912 ఫిర్యాదులు వచ్చాయి. అందులోని 297 ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోని 65,08,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ వెల్లడించింది. నిషేధించిన ఖాతాల్లో చాలా వరకు ఫిర్యాదులు అందినవే ఉండగా.. మరికొన్నింటిని ముందుజాగ్రత్తగా తొలగించినట్లు పేర్కొంది. 24,20,700 ఖాతాలను ఫిర్యాదులు అందకుండానే నిషేధించినట్లు తెలిపింది. కాగా ఇవే కారణాలతో ఏప్రిల్లో 74 లక్షల ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.
కాగా మన దేశంలో చాలా కాలంగా ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ప్రతిరోజు దేశవ్యాప్తంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే ఈ ఆన్లైన్ మోసాలన్నింటికి (online Scams) వాట్సాప్ హాట్స్పాట్గా తయారైంది. వాట్సాప్ సందేశాలు, కాల్స్ రూపంలో యూజర్లకు వల వేస్తున్న మోసగాళ్లు వారి నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. ఇవే కాకుండా పలు మార్గాల్లో వాట్సాప్ వినియోగదారులను మోసగాళ్లు వేధిస్తున్నారు. వారి నుంచి తమ వినియోగదారులను రక్షించుకోవడానికి వాట్సాప్ ఎన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులను నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వాట్సాప్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా వినియోగదారుల భద్రత కోసం వాట్సాప్ ఇప్పటికే అనేక ఫీచర్లను అందిస్తుంది. అందులో భాగంగానే రెండు-దశల ధృవీకరణ పద్దతి, ఫార్వర్డ్ పరిమితులు, లాక్ పెట్టుకోవడం, నచ్చని వారిని బ్లాక్ చేయడం, తమ చాటింగ్ ఇతరులకు ఎక్కువ సేపు కనిపించకుండా ఉండడం వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ మోసాలు పెరిగిపోతుండడంతో వాట్సాప్ మేనేజ్మెంట్ సదరు ఖాతాలపై నిషేధం విధించింది.