IND vs WI: ఇక రంజీ ట్రోఫీలు నిర్వహించడం దండగ.. గవాస్కర్, చోప్రా ఆగ్రహం

ABN , First Publish Date - 2023-06-24T13:49:34+05:30 IST

టీమిండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, ఆకాష్ చోప్రా విండీస్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల పెదవి విరిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారిని కాకుండా.. ఐపీఎల్‌లో రాణించినవారిని టెస్ట్ టీంకు ఎంపిక చేయడం పట్ల ఈ మాజీలిద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బాల్ క్రికెట్‌కు వైట్ బాల్ క్రికెట్ ఆడిన వారిని ఎంపిక చేస్తే ఇక ప్రతి ఏడాది రంజీలు నిర్వహించడమేందుకని ప్రశ్నించారు.

IND vs WI: ఇక రంజీ ట్రోఫీలు నిర్వహించడం దండగ.. గవాస్కర్, చోప్రా ఆగ్రహం

వెస్టిండీస్ పర్యటనకు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను (Sarfaraz Khan) ఎంపిక చేయకపోవడం పెద్ద దుమారానికి దారి తీసింది. ఇప్పటికే నెటిజన్లు, అభిమానులు టీమిండియా (Team India) సెలక్షన్‌ను తప్పుబడుతుండగా.. తాజాగా వీరికి మాజీ క్రికెటర్లు కూడా తోడయ్యారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, ఆకాష్ చోప్రా (Aakash Chopra) విండీస్ పర్యటనకు సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడం పట్ల పెదవి విరిచారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారిని కాకుండా.. ఐపీఎల్‌లో (IPL) రాణించినవారిని టెస్ట్ టీంకు ఎంపిక చేయడం పట్ల ఈ మాజీలిద్దరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బాల్ క్రికెట్‌కు వైట్ బాల్ క్రికెట్ ఆడిన వారిని ఎంపిక చేస్తే ఇక ప్రతి ఏడాది రంజీలు (Ranji Trophy) నిర్వహించడమేందుకని ప్రశ్నించారు.

mumbai_batter_sarfaraz_khan_696x696_57d5ea8873.webp

ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ‘‘ సర్ఫరాజ్ ఖాన్ రంజీల్లో దుమ్ములేపుతున్నాడు. వరుసగా మూడు సీజన్లలో దాదాపు 100 సగటుతో పరుగులు సాధిస్తూ అదరగొడుతున్నాడు. అయినప్పటికీ సర్ఫరాజ్‌కు టీమిండియా టెస్ట్ జట్టులో చోటు దక్కడం లేదు. అతను టీంలోకి రావాలంటే ఇంతకుమించి ఏం చేయాలి. అతన్ని తుది జట్టులో ఆడించకపోయినా కనీసం పూర్తి స్క్వాడ్‌కు ఎంపిక చేసినా, రంజీల్లో ఆడుతున్న దానికి గుర్తింపు దక్కినట్టైవుతుంది. కానీ సెలెక్టర్లు మాత్రం రంజీల్లో ఆడినవారిని పట్టించుకోకుండా ఐపీఎల్ ఆడిన వారికే అవకాశం ఇస్తున్నారు. అలాంటప్పుడు అంత ఖర్చు పెట్టి ప్రతి ఏడాది రంజీ ట్రోఫి నిర్వహించడం దండగ. ఆటగాళ్లు ఇక రంజీ క్రికెట్ ఆడకండి’’ అని మండిపడ్డారు.

Sunil-Gavaskar.jpg

టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ‘‘విండీస్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు సర్పరాజ్ ఖాన్‌ను ఎందుకు ఎంపిక చేయలేదో సెలెక్టర్లు స్పష్టత ఇవ్వలేదు. నిజానికి గత మూడేళ్లలో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద పారిస్తున్నాడు. అయినప్పటికీ అతన్ని టీమిండియాకు ఎంపిక చేయకపోతే ఎలాంటి సందేశం పంపినట్టవుతుంది? సర్ఫరాజ్ ఖాన్ విషయంలో మీకు ( సెలెక్టర్లు) నచ్చనిది ఇంకా ఏమైనా ఉందా? ఒక వేళ ఉంటే దాని గురించి చెప్పినట్టైతే.. సర్ఫరాజ్ ఖాన్ దాన్ని సరిదిద్దుకుని ముందుకు వెళ్లేందుకు వీలుంటుంది. ’’ అని తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్నారు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చేసే పరుగులకు విలువ ఇవ్వకుంటే, అది నోటికి పుల్లని రుచిని ఇచ్చినట్టవుతుందని చోప్రా వ్యాఖ్యానించారు.

roUcc1kp_400x400.jpg

కాగా 25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఇప్పటివరకు 37 మ్యాచ్‌లాడి ఏకంగా 79 సగటుతో 3,505 పరుగులు చేశాడు. వరుసగా 3 సీజన్లలో 100 సగటుతో పరుగులు సాధించడం గమనార్హం. తాజాగా విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ గణాంకాల కన్నా సర్ఫరాజ్ గణాంకాలే మెరుగ్గా ఉన్నాయి. అయితే గతంలో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా కూడా సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. కానీ ప్రస్తుతం సర్పారాజ్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ చోటు దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాగా వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు 16 మందితో కూడిన జట్టును సెలెక్టర్లు శుక్రవారం ప్రకటించారు.

టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

Updated Date - 2023-06-24T16:55:39+05:30 IST