IND vs AUS 2nd ODI: ఓవర్లు కుదింపు.. మరో 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేయాలంటే..?

ABN , First Publish Date - 2023-09-24T20:47:48+05:30 IST

భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న ఇండోర్‌లో ప్రస్తుతం వర్షం ఆగింది. రెండు సార్లు వర్షం అడ్డుపడడంతో చాలా సమయం వృథా అయింది. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు.

IND vs AUS 2nd ODI: ఓవర్లు కుదింపు.. మరో 24 ఓవర్లలో ఆస్ట్రేలియా ఎన్ని పరుగులు చేయాలంటే..?

ఇండోర్: భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న ఇండోర్‌లో ప్రస్తుతం వర్షం ఆగింది. రెండు సార్లు వర్షం అడ్డుపడడంతో చాలా సమయం వృథా అయింది. దీంతో అంపైర్లు ఓవర్లను కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం ఆస్ట్రేలియా విజయ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా నిర్దేశించారు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 9 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మరో 24 ఓవర్లలోనే 261 పరుగులు చేయాలి. 8 వికెట్లు చేతిలో ఉన్నాయి.


ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగా కోల్పోయింది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌లో 8 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 16 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. అయితే ఈ ఆనందం కంగారులకు ఎంతో సేపు నిలవలేదు. అనంతరం జత కట్టిన మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్, వన్ డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్ చేశారు. టీ20 స్టైల్‌లో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ఫోర్లు, సిక్సులతో టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే జట్టు స్కోర్ 9.5 ఓవర్లలో 79 పరుగుల వద్ద ఉండగా వర్షం కాసేపు అడ్డుపడింది. వర్షం తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌లో గిల్, శ్రేయస్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశారు. దీంతో టీమిండియా స్కోర్ 8 రన్ ‌రేటుకు తగ్గకుండా పరుగులు పెట్టింది. పవర్ ప్లేలోనే భారత జట్టు 80 పరుగులు చేసింది. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ గిల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అది కూడా గ్రీన్ వేసిన 14వ ఓవర్ మొదటి బంతికి సిక్సు కొట్టి హాఫ్ సెంచరీ మార్కు చేరుకున్నాడు. కాగా గత మ్యాచ్‌లో కూడా గిల్ సిక్సు కొట్టి 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకోవడం గమనార్హం. అనంతరం శ్రేయస్ అయ్యర్ కూడా 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీల అనంతరం గిల్, శ్రేయస్ మరింత రెచ్చిపోయారు. ధాటిగా బ్యాటింగ్ చేశారు. దీంతో వీరిద్దరి మధ్య భాగస్వామ్యం కూడా సునాయసంగా 100 పరుగులు దాటింది. శ్రేయస్, గిల్‌ను ఆపడానికి ఆస్ట్రేలియా బౌలర్లు చేసిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 158కి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆడమ్ జంపా వేసిన 30వ ఓవర్‌లో శ్రేయస్ అయ్యర్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఫోర్లు, 3 సిక్సులతో 86 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వన్డేల్లో శ్రేయస్‌కు ఇది 3వ సెంచరీ. కాగా గాయం కారణంగా చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ సెంచరీతో ఫామ్‌లోకి రావడం ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో గిల్, శ్రేయస్ మధ్య 200 పరుగుల భాగస్వామ్యం కూడా పూర్తైంది. అయితే ఈ భాగస్వామ్యాన్ని ఎట్టకేలకు 31వ ఓవర్లో పేసర్ సీన్ అబాట్ విడదీశాడు. ఆ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్ బౌండరీ లైన్ వద్ద ఉన్న మాథ్యూ షార్ట్‌కు దొరికిపోయాడు. దీంతో 216 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. మొత్తంగా 90 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 11 ఫోర్లు, 3 సిక్సులతో 105 పరుగులు చేశాడు. దీంతో 163 బంతుల్లోనే 200 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అనంతరం 6 ఫోర్లు, 4 సిక్సులతో శుభ్‌మన్ గిల్ కూడా సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో గిల్‌కు ఇది ఆరో సెంచరీ కాగా.. ఈ సంవత్సరమే ఐదో సెంచరీ కావడం విశేషం. అయితే గిల్ కూడా సెంచరీ చేసిన వెంటనే ఔట్ అయ్యాడు. గ్రీన్ వేసిన 35వ ఓవర్‌లో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 243 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.

F6yV0rTaQAApLXo.jpg


అదే ఓవర్‌లో కెప్టెన్ రాహుల్ సిక్సుతో తన పరుగుల ఖాతాను ప్రారంభించగా.. ఎదుర్కొన్న మొదటి బంతినే ఇషాన్ కిషన్ సిక్స్ బాదాడు. గిల్, శ్రేయస్ వేసిన బలమైన పునాదిని మిగతా బ్యాటర్లు కూడా కొనసాగించడంతో టీమిండియా స్కోర్ బోర్డులో ఎక్కడా దూకుడు తగ్గలేదు. దీంతో 40 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు ఏకంగా 296 పరుగులు చేసింది. గ్రీన్ బౌలింగ్‌లో రాహుల్ బాదిన సిక్సర్ అయితే ఏకంగా గ్రౌండ్ బయట పడింది. దూకుడుగా ఆడిన రాహుల్, కిషన్ 33 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 41వ ఓవర్‌లో స్పిన్నర్ ఆడమ్ జంపా విడదీశాడు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 18 బంతుల్లోనే 31 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ యాదవ్ రెచ్చిపోయాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవర్ మొదటి 4 బంతులను సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 26 పరుగులొచ్చాయి. అనంతరం రాహుల్ 35 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో రాహుల్‌కు ఇది 15వ హాఫ్ సెంచరీ. అనంతరం సూర్యకుమార్ యాదవ్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 5 సిక్సులు, 3 ఫోర్లతో 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని బాదేశాడు. వన్డేల్లో సూర్యకు ఇది 4వ హాఫ్ సెంచరీ. ఈ క్రమంలో జట్టు స్కోర్ కూడా 350 పరుగులు దాటింది. అయితే 3 ఫోర్లు, 3 సిక్సులతో 38 బంతుల్లోనే 52 పరుగులు చేసిన రాహుల్ గ్రీన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 46 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.

F6ymF9CaYAAI3_Q.jpg

అనంతరం జడేజాతో కలిసి టీమిండియా స్కోర్ బోర్డును సూర్యకుమార్ యాదవ్ పరుగులు పెట్టించాడు. దీంతో టీమిండియా స్కోర్ సునాయసంగా 400 పరుగులు దాటేలా కనిపించింది. కానీ చివరి 2 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే రావడంతో టీమిండియా స్కోర్ 5 వికెట్ల నష్టానికి 399 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు టీమిండియా 400 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. చివరి 10 ఓవర్లలో భారత బ్యాటర్లు 103 పరుగులు రాబట్టారు. కాగా వన్డేల్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. 6 ఫోర్లు, 6 సిక్సులతో 37 బంతుల్లోనే 72 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఒక ఫోర్‌తో 9 బంతుల్లోనే 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా నాటౌట్‌గా నిలిచారు. ఆసీస్ బౌలర్లలో గ్రీన్ 2, జంపా, అబాట్, హాజీల్‌వుడ్ తలో వికెట్ తీశారు. భారత బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు ఆస్ట్రేలియా పేసర్ కామెరూన్ గ్రీన్ ఏకంగా 103 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లంతా కలిసి ఏకంగా 18 సిక్సులు, 31 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలో భారత జట్టు వన్డేల్లో 3 వేల సిక్సులను పూర్తి చేసుకుంది. దీంతో వన్డేల్లో 3 వేల సిక్సులు కొట్టిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.


Updated Date - 2023-09-24T21:01:35+05:30 IST