Share News

World Cup: లంకపై రోహిత్, కోహ్లీకి సూపర్ రికార్డులు.. భారత్ vs శ్రీలంక హెడ్ టూ హెడ్ రికార్డులివే!

ABN , First Publish Date - 2023-11-02T13:26:06+05:30 IST

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే 6 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌ బెర్త్ ఖరారు అవుతుంది.

World Cup: లంకపై రోహిత్, కోహ్లీకి సూపర్ రికార్డులు.. భారత్ vs శ్రీలంక హెడ్ టూ హెడ్ రికార్డులివే!

ముంబై: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ప్రపంచకప్‌లో నేడు కీలక పోరుకు సిద్ధమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే 6 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సెమీస్‌ బెర్త్ ఖరారు అవుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో శ్రీలంకను ఓడించడం టీమిండియాకు పెదగా కష్టం కాకపోవచ్చు. పైగా మన సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి శ్రీలంకపై సూపర్ రికార్డులున్నాయి. గత వన్డే రికార్డుల్లోనూ శ్రీలంకపై భారత్‌దే పై చేయిగా ఉంది. ఇక వన్డే ప్రపంచకప్‌లో రెండు జట్లు తలపడినప్పుడు గత 5 మ్యాచ్‌ల్లో భారత్ ఏకంగా 4 సార్లు గెలిచింది.


వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, శ్రీలంక ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండు జట్లు నాలుగేసి సార్లు గెలిచాయి. అయితే ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య పోటీలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు భారత్ పేరు మీదనే ఉంది. భారత్ 373 పరుగులు చేసింది. అత్యల్ప స్కోర్ శ్రీలంక పేరు మీద ఉంది. లంక 109 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకంగా 4 సార్లు గెలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్, శ్రీలంక జట్లు ఇదే మైదానంలో 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో లంకను భారత్ ఓడించింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను శ్రీలంక చివరగా 2007లో ఓడించింది. మొత్తంగా చూసుకుంటే రెండు జట్ల మధ్య వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 167 మ్యాచ్‌లు జరిగాయి. అత్యధికంగా టీమిండియా 98 మ్యాచ్‌లు గెలవగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. మన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్లో శ్రీలంకపై మంచి రికార్డులున్నాయి. శ్రీలంకతో 51 వన్డే మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 46 సగటుతో 1860 పరుగులు చేశాడు. తాను సాధించిన మూడు డబుల్ సెంచరీల్లో 2 శ్రీలంక మీదనే సాధించాడు. హిట్‌మ్యాన్ వన్డే అత్యధిక వ్యక్తిగత స్కోర్ 264 సాధించింది శ్రీలంక మీదనే కావడం గమనార్హం. విరాట్ కోహ్లీకి కూడా శ్రీలంకపై మంచి రికార్డులున్నాయి. లంకతో 52 వన్డే మ్యాచ్‌లాడిన కోహ్లీ ఏకంగా 62 సగటుతో 2,506 పరుగులు చేశాడు. శ్రీలంకపై ఏకంగా 10 సెంచరీలు బాదాడు. వన్డేల్లో శ్రీలంకపై అత్యధిక సెంచరీలు చేసింది కోహ్లీనే కావడం గమనార్హం.

Updated Date - 2023-11-02T13:46:48+05:30 IST