Asia Cup 2023: టీమిండియా చెత్త ఫీల్డింగ్.. మూడు క్యాచ్‌లు నే(ల)పాలు

ABN , First Publish Date - 2023-09-04T17:33:49+05:30 IST

సూపర్-4లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు టీమిండియా, ఇటు నేపాల్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సులభమైన మూడు క్యాచ్‌లను మన ఆటగాళ్లు నేలపాలు చేశారు.

Asia Cup 2023: టీమిండియా చెత్త ఫీల్డింగ్.. మూడు క్యాచ్‌లు నే(ల)పాలు

ఆసియా కప్‌లో టీమిండియా చెత్త ప్రదర్శన మరోసారి బయటపడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాట్‌తో విఫలమైన మన స్టార్ ఆటగాళ్లు.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఫీల్డింగ్‌తో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. ఏకంగా మూడు క్యాచ్‌లను వదిలిపెట్టడంతో బౌలర్లు ఒత్తిడికి గురై ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 104 పరుగులకే ఆలౌటైన నేపాల్.. టీమిండియాపై మాత్రం 10 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

సూపర్-4లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు టీమిండియా, ఇటు నేపాల్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే నేపాల్ ఓపెనర్లు ఇచ్చిన సులభమైన క్యాచ్‌లను మన ఆటగాళ్లు నేలపాలు చేశారు. తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే అవకాశం రాని ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకపోవడంతో పసికూన మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో విమర్శలు మూటగట్టుకున్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ఫీల్డర్లు ఈ క్యాచ్‌లను వదిలిపెట్టడం టీమిండియాను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ మూడు క్యాచ్‌లను డ్రాప్ చేశారు.

ఇది కూడా చదవండి: Shubman Gill: ఐపీఎల్ తర్వాత గిల్‌కు ఏమైంది? వరుస వైఫల్యాలకు కారణమేంటి?

టీమిండియా బౌలర్ షమీ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుషాల్ స్లిప్‌లో ఇచ్చిన సునాయస క్యాచ్‌ను శ్రేయస్ అయ్యర్ వదిలేశాడు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ వేసిన ఆ మరుసటి బంతికి మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను షార్ట్ కవ‌ర్‌లో ఉన్న విరాట్ కోహ్లీ నేలపాలు చేశాడు. అనంతరం మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కుషాల్ మరోసారి ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అందుకోలేకపోయాడు. దీంతో వరుసగా మూడు క్యాచ్‌లను వదిలేసిన భారత ఆటగాళ్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు 10వ ఓవర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. కాగా పసికూనపైనే ఇలాంటి చెత్త ఫీల్డింగ్ చేస్తే.. మొన్న పాకిస్థాన్‌పై ఆడే అవకాశం వస్తే మ్యాచ్‌ను ఏం చేసేవారో అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-09-04T17:37:31+05:30 IST