Share News

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

ABN , First Publish Date - 2023-10-26T19:33:55+05:30 IST

గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం.

ENG Vs SL: శ్రీలంకపైనా పరాజయం.. సెమీస్ రేసు నుంచి ఇంగ్లండ్ అవుట్..!!

వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు మరో ఘోర పరాజయం ఎదురైంది. గురువారం బెంగళూరు వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంక గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం. తాజా ఓటమితో సెమీస్ రేసు నుంచి అనధికారికంగా ఇంగ్లండ్ తప్పుకుంది. పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ 9వ స్థానానికి పరిమితం కాగా.. శ్రీలంక మాత్రం 4 పాయింట్లతో ఐదో స్థానానికి ఎగబాకింది. 157 పరుగుల విజయలక్ష్యాన్ని 25.4 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి శ్రీలంక ఛేదించింది. ఓపెనర్ పాథుమ్ నిశాంక, సధిర సమరవిక్రమ హాఫ్ సెంచరీలతో రాణించారు. నిశాంక 83 బాల్స్‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా.. సమరవిక్రమ 54 బాల్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లీకే రెండు వికెట్లు పడ్డాయి.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ కేవలం 33.2 ఓవర్లు మాత్రమే ఆడి 156 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ (43), బెయిర్ స్టో (30), మలాన్ (28), మొయిన్ అలీ (15), డేవిడ్ విల్లీ (14) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. రూట్ (3), బట్లర్ (8), లివింగ్ స్టోన్ (1) దారుణంగా నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 3 వికెట్లు తీయగా, ఏంజిలో మాథ్యూస్ 2, కాసున్ రజిత 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన లహిరు కుమారకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Updated Date - 2023-10-26T19:33:55+05:30 IST