Share News

PAK Vs NZ: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

ABN , First Publish Date - 2023-11-04T19:49:19+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తోె జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు.

PAK Vs NZ: న్యూజిలాండ్‌పై పాకిస్థాన్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం

వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుతం చేసింది. 402 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలినా బెదిరిపోలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ 4 పరుగులకే అవుట్ కావడంతో ఆరు పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ ఫకార్ జమాన్ చెలరేగి ఆడాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురవడానికి ముందే సిక్సర్ల వర్షం కురిపించాడు. 81 బాల్స్‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. తొలిసారి వర్షం తగ్గిన తర్వాత పాకిస్థాన్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 342 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.

కాగా పాకిస్థాన్ 25.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి జమాన్ (126 నాటౌట్), బాబర్ ఆజమ్ (66 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో రాత్రి 7:40 గంటలను కటాఫ్ టైమ్‌గా అంపైర్లు ప్రకటించారు. అప్పటిలోగా మ్యాచ్ మరోసారి ప్రారంభం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు. సెమీస్‌కు వెళ్లాలంటే అటు న్యూజిలాండ్, ఇటు పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి తీరాలి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలి. ఎందుకంటే నెట్ రన్‌రేట్ వాళ్లకు మైనస్‌లో ఉంది.

Updated Date - 2023-11-04T19:49:20+05:30 IST