Share News

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్

ABN , Publish Date - Dec 15 , 2023 | 02:44 PM

Team India: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో ఓ అరుదైన రికార్డును కుల్‌దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం కుల్‌దీప్ పుట్టినరోజు కావడం విశేషం. బర్త్ డే రోజు జరిగిన టీ20 మ్యాచ్‌లలో ఓ బౌలర్ 5 వికెట్లు తీయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పుట్టినరోజు 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా కుల్‌దీప్ చరిత్ర సృష్టించాడు.

Team India: చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్

జోహన్నెస్ బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో సిరీస్ ఓడిపోకుండా ఉండాలంటే మూడో టీ20లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మేరకు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ సెంచరీతో వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఏకంగా ఐదు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను కుప్పకూల్చాడు.

ఈ సందర్భంగా ఓ అరుదైన రికార్డును కుల్‌దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం కుల్‌దీప్ పుట్టినరోజు కావడం విశేషం. బర్త్ డే రోజు జరిగిన టీ20 మ్యాచ్‌లలో ఓ బౌలర్ 5 వికెట్లు తీయడం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో పుట్టినరోజు 5 వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా కుల్‌దీప్ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో బర్త్‌డే రోజు అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో శ్రీలంక ఆటగాడు హసరంగ ( 4 వికెట్లు) ఉన్నాడు. కాగా పుట్టినరోజున భారత్ తరపున ఇప్పటివరకు ముగ్గురు బౌలర్లు బరిలోకి దిగారు. కుల్‌దీప్ కంటే ముందు యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా టీ20 మ్యాచ్‌లు ఆడారు. శ్రీలంకపై 2009లో యువరాజ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. 2020లో వెస్టిండీస్‌పై రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. అయితే ఈ ముగ్గురు బౌలర్లు లెఫ్టార్మ్ స్పిన్నర్లే కావడం మరో విశేషం.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 02:44 PM