Share News

Team India: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు ఆటకు దూరం

ABN , Publish Date - Dec 23 , 2023 | 07:57 PM

Team India: టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ నుంచి తప్పుకున్న అతడు ఇండియా వచ్చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Team India: ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం.. కొన్నాళ్లు ఆటకు దూరం

టీమిండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ నుంచి తప్పుకున్న అతడు ఇండియా వచ్చేశాడు. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఇషాన్ కిషన్ స్వదేశానికి రావడంపై పలువురికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీ20, వన్డే సిరీస్‌లో అవకాశం దక్కకపోయినా.. టెస్ట్ సిరీస్‌లో ఇషాన్ ఆడతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఇషాన్ తప్పుకోవడం వెనుక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశం తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అతడు కొన్నాళ్లు ఆటకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.

వన్డే ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్‌ అస్వస్థతతో బాధపడటంతో తొలి రెండు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్‌కు అవకాశం వచ్చింది. కానీ గిల్ రావడంతో కిషన్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కనపెట్టింది. అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్.. సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ ఇవ్వడం.. జితేశ శర్మకు అవకాశం ఇవ్వడంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తాను ఎంపికైనా.. తొలి ప్రాధాన్యత కేఎల్ రాహుల్‌కే ఉండటంతో తాను తప్పుకోవడమే ఉత్తమమని ఇషాన్ కిషన్ భావించాడు. అందుకే స్వదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తు్న్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 23 , 2023 | 07:57 PM