Nagpur Test: ఆసీస్‌పై అద్భుత విజయం.. అంతలోనే షాక్!

ABN , First Publish Date - 2023-02-11T17:24:36+05:30 IST

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Astralia)తో

Nagpur Test: ఆసీస్‌పై అద్భుత విజయం.. అంతలోనే షాక్!

నాగ్‌పూర్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా ఆస్ట్రేలియా(Astralia)తో నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్(Rohit Sharma) సేనకు అంతలోనే షాక్ తగిలింది. అంపైర్ల అనుమతి లేకుండా చేతికి ఆయింట్‌మెంట్ పూసుకున్న రవీంద్ర జడేజా(Ravindra Jadeja)పై ఐసీసీ(ICC) కొరడా ఝళిపించింది. ఓ డిమెరిట్ పాయింట్‌తోపాటు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది. నొప్పి నుంచి ఉపశమనం కోసం పూసుకున్న ఆయింట్‌మెంట్ ఘటనపై జడేజా ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఐసీసీ జడేజాను మందలించి స్వల్ప జరిమానాతో సరిపెట్టింది.

బంతి ఆకారాన్ని మార్చే ఉద్దేశంతో జడేజా ఆయింట్‌మెంట్ పూసుకోలేదని పేర్కొన్న ఐసీసీ.. ఈ విషయంలో తొలుత అంపైర్ల అనుమతి తీసుకోనందుకే జరిమానా విధించినట్టు తెలిపింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. వేలికి గాయం కావడంతో జడేజా పెయిన్ రిలీఫ్ ఆయింట్‌మెంట్( Pain-Relief Ointment) పూసుకున్నాడు. అయితే, అక్కడి టీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. జడేజా బాల్ ట్యాంపరింగ్‌కు ప్రయత్నించాడంటూ ఆసీస్ మీడియా, మాజీ క్రికెటర్లు ఆరోపించారు.

అంతేకాదు, క్రికెట్‌లో ఇలాంటి దాన్ని పూసుకోవడాన్ని తామెప్పుడూ చూడలేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్, ఆస్ట్రేలియా ఆటగాడు టిమ్ పైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతడు ఏం పూసుకున్నాడని ప్రశ్నించారు. అయితే, జడేజా తన వేలికి ఆయింట్‌మెంట్ రాసుకున్నాడని తేలడంతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఈ విషయంలో రచ్చ మరింత పెద్దది కావడంతో ఐసీసీ తీవ్రంగా పరిగణించింది. విచారణ జరిపింది. జడేజా ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందిన ఐసీసీ.. జడేజా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని పేర్కొంది. అయితే, అంపైర్‌కు చెప్పకుండా చేయడం తప్పని, దీంతో మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్టు తెలిపింది. జడేజా కనుక ఈ ఏడాది మరో రెండు డిమెరిట్ పాయింట్లను ఎదుర్కొంటే ఓ మ్యాచ్ నిషేధం ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి ఏడు వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించి 70 పరుగులు చేసిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.

Updated Date - 2023-02-11T17:24:38+05:30 IST