Harbhajan Singh: ప్రపంచకప్‌లో టీమిండియాకు అతడే కీలకం

ABN , First Publish Date - 2023-07-02T14:18:40+05:30 IST

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియాలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కీలకంగా మారతాడని జోస్యం చెప్పాడు. ఎందుకంటే మెగా టోర్నీ ఇండియాలోనే జరుగుతుందని.. ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలో గిల్‌కు మంచి అవగాహన ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.

Harbhajan Singh: ప్రపంచకప్‌లో టీమిండియాకు అతడే కీలకం

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో ఇండియాలో అతిపెద్ద ఐసీసీ (ICC) టోర్నమెంట్ నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. టీమిండియా (Team India) ఐసీసీ టైటిల్ నెగ్గి చాలా కాలం అవుతుండటంతో క్రికెట్ అభిమానులు సొంతగడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌ (World Cup) కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచకప్ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌తో పాటు టీమిండియా ట్రోఫీ కూడా గెలవాలని అభిమానులు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. జట్టు ఎంపిక ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బుమ్రా దంచికొట్టుడుకు ఏడాది పూర్తి

అయితే వన్డే ప్రపంచకప్ ఆడే టీమిండియా జట్టులో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ఏ ఫార్మాట్‌లో అయినా గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. టెస్ట్ ఛాంపియన్ షిప్ (ICC Test Championship) ఫైనల్ మ్యాచ్‌ను మినహాయిస్తే గిల్ ఫామ్ మీద ఎవరికీ అనుమానాలు లేవు. ఈ నేపథ్యంలో భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లో టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కీలకంగా మారతాడని జోస్యం చెప్పాడు. ఎందుకంటే మెగా టోర్నీ ఇండియాలోనే జరుగుతుందని.. ఇక్కడి పిచ్‌లపై ఎలా ఆడాలో గిల్‌కు మంచి అవగాహన ఉందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. అయితే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం ప్రపంచకప్‌లో ఓపెనింగ్ జోడీని మార్చాలని హితవు పలికాడు. రోహిత్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ కుడిచేతి వాటం బ్యాటర్లే అని.. దీంతో కుడి-ఎడమ కాంబినేషన్ ఉండేలా జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐకి సూచించాడు. మరి రవిశాస్త్రి సూచనను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందా.. గిల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Updated Date - 2023-07-02T14:18:40+05:30 IST